తెలంగాణ శాసనసభ ఎన్నికల జోష్ను కంటెన్యూ చేసేలా.. లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతోనే కేబినెట్ విస్తరణకు రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం అనుమతిని కోరారు. దీని ప్రకారం కేబినేట్ విస్తరణ దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.
ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి కేబినెట్ విస్తరణపై హస్తిన పెద్దలతో చర్చించి ఆరుగురిని ఎంపిక చేయడానికి రేవంత్ రెడ్డి సమాయత్తమయ్యారు. దీనికోసం తన కేబినెట్లోకి తీసుకునే నేతల గురించి కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ పదవులను కూడా భర్తీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందే.. పదవులు భర్తీ చేయడం వల్ల నేతలు మరింత సమర్థంగా పనిచేస్తారని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తన పాలనలోను, పార్టీలోనూ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా సీఎం రేవంత్రెడ్డి అడుగులు వేస్తున్నారు. పార్టీలో ముఖ్య నిర్ణయాలను పార్టీ అధిష్టానం అనుమతితో అమలు చేయబోతున్నారు. దీంతోనే మంత్రివర్గ విస్తరణ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీజేఎస్ అధినేత కోదండరామ్ను తన మంత్రివర్గంలోకి తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం మరో ఆరుగురికి అవకాశం ఉంది. నిజానికి వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను రేవంత్ రెడ్డి పెండింగ్లో పెట్టారు. హోం శాఖతో పాటు విద్యా శాఖ, సాంఘిక సంక్షేమశాఖ, మున్సిపల్ శాఖ వంటి ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్లో ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి,హైదరాబాద్,నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో… మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ మంత్రివర్గాన్ని ఫిబ్రవరి నెలాఖరున విస్తరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులను కొన్నింటిని ప్రకటించడానికి తమ కసరత్తును తుది దశకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరామ్ను తీసుకోవడం కన్ఫమ్ అని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించడంతో పాటు.. పొలిటికల్ జేఏసీ వేదికతో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన క్రెడిట్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కోదండరామ్ కాంగ్రెస్కు మద్దతుగా నిలవడంతో .. కోదండరామ్ను మంత్రిని చేసి విద్యాశాఖను అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కోదండరామ్కు మంత్రి పదవి ఇస్తే.. బీఆర్ఎస్పై నైతికంగా పైచేయి సాధించినట్లేనని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు.
మిగిలిన ఐదు మంత్రి పదవుల్లో షబ్బీర్ అలీకి ఒకటి కన్ఫమ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నెలకొంది. చెన్నూరులో గెలిచిన వివేక్,బెల్లంపల్లిలో విజయం సాధించిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం తాజాగా సోనియా గాంధీని కలిశారు. అయితే రేవంత్ రెడ్డి తనకు ఎలా అయినా అవకాశం ఇస్తారనే నమ్మకంతో వివేక్ ఉన్నారు.అలాగే నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కూడా కేబినెట్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులెవరూ గెలవలేదు. అయినా కూడా మైనారిటీ కోటాలో ఫిరోజ్ఖాన్ను మంత్రిని చేస్తే మంచిదన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కాకపోతే షబ్బీర్ అలీ, ఫిరోజ్ఖాన్లలో ఒకరికి మాత్రమే మంత్రిపదవిని అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE