ఏపీలో నేతల ఫిరాయింపులతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగు దేశం పార్టీలోకి జంప్ అయ్యారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు.
సీనియర్ రాజకీయ నాయకుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కొద్దిరోజులుగా వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. 2019లో వైసీపీ తరుపున మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. కానీ కొద్దిరోజులుగా ఆయన వైసీపీ హైకమాండ్కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా తమ ప్రభుత్వంపైనే ఆయన పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్గా మారారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తే సరిపోదని.. అభివృద్ధి పనులు కూడా చేపట్టాలని పలుమార్లు బహిరంగంగా కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ హైకమాండ్ కూడా వసంత కృష్ణప్రసాద్పై ఆగ్రహంతో ఉంది. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించింది. మైలవరం నుంచి కృష్ణప్రసాద్ను సైడ్ చేసి.. జెడ్పీటీసీ తిరుపతిరావును బరిలోకి దింపుతోంది. ఈ మేరకు ఇటీవల వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తిరుపతిరావును మైలవరం ఇంఛార్జ్గా వైసీపీ ప్రకటించింది. ఈక్రమంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీ హైకమాండ్తో టచ్లోకి వెళ్లారు. ఆ పార్టీలో చేరేందుకు టీడీపీ పెద్దలతో మంతనాలు జరిపారు.
వసంత చేరికకు చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈక్రమంలో శనివారం హైదరాబాద్ చంద్రబాబు నాయుడు సమక్షంలో తన అనుచరులతో కలిసి వసంత కృష్ణప్రసాద్ తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. ఆయనతో పాటు వైసీపీకి చెందిన మరికొందరు నాయకులు కూడా టీడీపీలోకి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే పెనమలూరు నుంచి అయినా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY