ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం మేనిఫెస్టో. ఎన్నికలకు ముందే ఇది సంచలనంగా మారింది. వైసీపీ గెలుపునకు దోహదం పడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు అమలు దిశగా జగన్ వడివడిగా అడుగులు వేశారు. అతి తక్కువ కాలంలోనే మెజారిటీ అంశాలను అమల్లోకి తెచ్చారు. దీనిపై తీవ్రమైన స్థాయిలో చర్చ జరిగింది. జగన్ దూకుడుకు రాష్ట్రంలో ఇక వైసీపీ తప్పా.. మరో పార్టీకి స్థానం లేదనే రీతిలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ చేసింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగరడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఖ్యాతి పెరగడానికా కారణమైన మేనిఫెస్టోనే జగన్ ప్రభుత్వం ప్రచార అస్త్రంగా మార్చుకుంటోంది. మేనిఫెస్టోలోని హామీలను 95.9 శాతం అమలు చేశామంటూ సగర్వంగా చెప్పుకుంటోంది.
ఈరోజు అసెంబ్లీలో సాగిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో కూడా మేనిఫెస్టో కీలకంగా మారింది. ఐదేళ్ల క్రితం మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు.. మేనిఫెస్టోను జగన్ పవిత్ర గ్రంథంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా అందరికీ సమన్యాయం చేశామని చెప్పుకొచ్చారు. అర్ధశాస్త్రంలో కౌటిల్యుడు పేర్కొన్న విధంగానే జగన్ పాలన సాగిందని వెల్లడించారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 1.35 లక్షల మంది ఉద్యోగులతో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాదు.. వాలంటీర్ల నియామకం ద్వారా సంక్షేమ పథకాలను గడప గడపకూ అందిస్తున్నామని చెప్పారు. 99.81 శాతం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని వెల్లడించారు. అలాగే.. ఆరోగ్య రంగంలో నాడు-నేడు పథకం అమలు కోసం రూ.16 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు వివరించారు.
మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగానే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలను అందిస్తున్నామని, క్యాన్సర్ వంటి వ్యాధులకు పరిమితి లేదని అన్నారు. అమ్మఒడి పథకం ద్వారా 43.61 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.26,067 కోట్లు జమ చేశాం. ఈ పథకం వల్ల 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరిందన్నారు. ఐదేళ్లలో 30.65 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి సంచలనం సృష్టించినట్లు వెల్లడించారు. సుమారు రూ.33 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు గ్గించాం. జనవరి నుంచి నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. ఇలా మేనిఫెస్టోలోని ప్రతీ అంశాన్ని ఉదహరిస్తూ ఆయన ప్రసంగం సాగింది.
2019లో ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు పెన్షన్లను రూ.రెండు వేలకు పెంచుతానంటూ జగన్ ప్రకటించారు. ఈ నిర్ణయం వెలువడిన కొద్ది రోజులకే అధికారంలో ఉన్న టీడీపీ దానిని అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకుఇచ్చే మొత్తాన్ని ఒకేసారి రెండు వేల రుపాయలకు పెంచింది. దీంతో అప్పటి ప్రతిపక్ష వైసీపీ పెన్షన్ మొత్తాన్నిమూడు వేలుచేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత దశలవారీగా పెన్షన్ మొత్తాన్ని మూడు వేలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అది కూడా అమల్లోకి వచ్చింది. 2019 ఎన్నికల నాటికి ఇచ్చిన హామీల్లో దాదాపు 95శాతం అమలు చేశామని ఆ పార్టీ చెబుతోంది. దాదాపు 129 హామీలు ఇస్తే అందులో 123 నెరవేర్చినట్లు వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే మరో 45 హామీలను అదనంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. మేనిఫెస్టో అమలు ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY