ఇప్పటి వరకూ పొలిటికల్ వార్ తెలంగాణలో ఒకవైపే నడిచింది. బీఆర్ ఎస్ అధినేత శస్త్రచికిత్స కారణంగా చాలా రోజులు ఇంటికే పరిమితం కావడం, సమావేశాల నిర్వహణ లేకపోవడంతో పదునైన మాటలు వినిపించలేదు. ఇతర నాయకుల విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఘాటుగా స్పందించేవారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్ తెరపైకి రావడంతో రాజకీయాలు రసకందాయంగా మారాయి. ‘‘ చుట్టు ముట్టూ సూర్యాపేట.. నట్టనడుమ నల్లగొండ.. నువ్వుండేది హైదరాబాద్.. దాని పక్క గోలకొండ..గోలకొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతం కొడుకో నైజాము సర్కరోడా ! ’’ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ సాయుధపోరాటానికి ఉద్యుక్తులను చేసిన.. ప్రజాగాయకుడు గద్దర్ ఆలాపించిన ఆనాటి ఈ గీతం నేటికీ ఎంతో ప్రశస్తం. నల్లగొండ అనేది నట్టనడుమ ఉండటంతో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు కూడా రాజకీయాలకూ నల్లగొండే కేంద్రబిందువుగా మారింది. నల్లగొండ సాక్షిగా బలనిరూపణకు బీఆర్ ఎస్, కాంగ్రెస్ సిద్ధం అవుతున్నాయి.
ప్రస్తుతం నల్లగొండ సభలు హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగానే నల్లగొండలో ఎండలు ఎక్కువ. ఇంకా వేసవి రాకముందే పొలిటికల్ హీట్ మాత్రం పెరిగింది. కారణం రెండు ప్రధాన పార్టీలూ తమ బలపరీక్షలకు నల్లగొండనే ఎంచుకోవడం. కృష్ణానదీ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున దాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్కు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ‘టచ్ చేసి చూడు’ అంటూ సీఎం రేవంత్కు సవాల్ విసిరారు. ఈనెల 13న నల్లగొండలో భారీ బహిరంగసభ విజయవంతమయ్యేందుకు నియోజకవర్గాల వారీగానూ ఇన్ఛార్జులను నియమించారు. తుంటి ఎముక ఆపరేషన్ అనంతరం తొలిసారిగా ప్రజలముందుకొచ్చిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం నిలవలేదనే వ్యాఖ్యానాలూ చేశారు. బీఆర్ఎస్ నేతల అంతరంగం ఏదో రకంగా బయటకు వెలువడుతూనే ఉంది. ఈ ప్రభుత్వం ఉండదని, హామీలు అమలు చేయలేరని, వారిలో వారే కొట్టుకొని ప్రభుత్వం కుప్పకూలుతుందని ఆయాచితంగానో,అనాలోచితంగానో, ఇంకోరకంగానో అంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండలో బలపరీక్షకు సిద్ధమవుతున్నారు.
ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం మీవల్ల కాదంటూ సీఎం రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి సభతో సహ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెడితే తాము కూడా తగ్గేదే లేదన్నట్లుగా 18వ తేదీన భారీ బహిరంగసభకు సిద్ధమయ్యారు. ఆ సభకు పార్టీ ముఖ్యనేత ప్రియాంకగాంధీని ఆహ్వానిస్తున్నారు. ఆ సందర్భంగా గ్యారంటీల్లోని ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రాజెక్టును తాము కేఆర్ఎంబీకి అప్పగించామని బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, ప్రాజెక్టుల్లో వారి అవినీతిని పక్కదారి మళ్లించేందుకే కొత్తడ్రామా మొదలు పెట్టారని మండి పడ్డారు. మొత్తానికి నల్లగొండ వేదికగా ఉభయపార్టీలూ తమ బలపరీక్షకు సిద్ధమయ్యాయి. తాము చేసింది.. చేస్తున్నది ఏమిటి..వైరి పక్షం చేస్తున్నదేమిటి? అన్నవి ప్రజలకు విడమర్చనున్నాయి. ఈ నేపథ్యంలో నల్లగొండ ఎవరికి అండ కానుందన్నది రాబోయే రోజుల్లో వెల్లడి కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY