కేంద్రంలో బీజేపీ పెద్దల ఆశీర్వాదం ఏపీ ముఖ్యమంత్రికి పుష్కలంగా దక్కుతున్నాయి. అన్ని విషయాల్లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. 2014-15 నాటి రెవెన్యూ లోటు నిధులను దాదాపు 10 ఏళ్ల తర్వాత జగన్ కి చేరడం అందులో భాగమే. వాటి కోసం చంద్రబాబు ఎన్నిమార్లు హస్తిన వెళ్ళినా మోడీ ప్రభుత్వం బాబు విమర్శలను ఖాతరు చేయలేదు. కానీ హఠాత్తుగా జగన్ కి రూ. 10వేల కోట్ల నిధులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆ వెంటనే పోలవరం ప్రాజెక్ట్ పేరుతో మరో రూ. 12వేల కోట్లు విడుదలయ్యాయి. ఇక తాజాగా అమరావతిలో పేదలకు సంబంధించిన 45 వేల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతినిచ్చింది. ఓవైపు ఆ ఇళ్ల నిర్మాణం అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారు. అమరావతి జేఏసీ నేతలు సుప్రీంకోర్టు వరకూ వెళ్ళారు. కానీ కేంద్రం మాత్రం పట్టాల పంపిణీతో ఆగకుండా తక్షణమే ఇళ్ల నిర్మాణం చేసేందుకు అనుమతులు ఇచ్చేసింది.
ఇదంతా పాలనాపరంగా సీఎం జగన్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న సానుకూల సంకేతాలు. సరిగ్గా అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలు టీడీపీతో తాము కలిసేది లేదని చెబుతున్నారు. ఓవైపు బీజేపీ, టీడీపీ కూటమి కోసం బాబు ఎదురుచూస్తున్నారు. ఇటీవల హస్తిన వెళ్ళి అమిత్ షా ని కలిసిన నేపథ్యంలో తెలంగాణాలో బీజేపీకి టీడీపీ అవసరం ఉంది కాబట్టి, ఏపీలో బాబుకి బీజేపీ చేదోడుగా నిలుస్తుందనే సంకేతాలు వచ్చాయి. కానీ తీరా జగన్ కి మేలు చేసేలా కేంద్రం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో బాబుకి రుచించని రీతిలో కూడా వ్యవహారాలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు తాజాగా మరోసారి తాము టీడీపీతో కలవడం లేదనే ప్రకటనలు చేశారు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని నష్టపోయామని కూడా అన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు కూడా చంద్రబాబుతో కలిసేందుకు సుముఖంగా లేరని సోము వీర్రాజు చెప్పేశారు. మరోవైపు జనసేన కూడా బీజేపీతో కలిసి ఉంటుందా లేదా అనే అనుమానాలున్నాయి. ఇప్పటికీ జనసేన తమతో ఉందని బీజేపీ అంటోంది. కానీ జనసేనాని మాత్రం ఆ విషయాన్ని చెప్పడం లేదు. దాంతో ఎవరు ఎవరితో కలుస్తారనే విషయంలో ఏపీ రాజకీయాల్లో అస్పష్టత కొనసాగుతోంది. అదే సమయంలో బీజేపీ మాత్రం టీడీపీని దగ్గరికి రానివ్వబోమని పదే పదే చెబుతుండడం ఆసక్తిగా మారింది. తద్వారా టీడీపీ నేతలను డిఫెన్స్ లోకి నెట్టే యత్నలో బీజేపీ ఉందనే విషయం రూడీ అవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE