ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును అందుకుంది. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఈ అవార్డును అందుకున్నారు. నిర్మాణంలో భాగంగా ఒకేసారి పెద్ద ఎత్తున పక్కా ఇళ్లను గ్రౌండింగ్ చేయడం, నిర్మాణ పనులు శరవేగంగా పూర్తిచేయడం మొదలైన విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఈ అవార్డు లభించిందని ఈ సందర్భంగా అజయ్ జైన్ తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఉత్తమ పనితీరుకు కేంద్ర అవార్డు లభించడం పట్ల గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఆ శాఖ అధికారులు, సిబ్బందికి జోగి రమేష్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. రాష్ట్రంలో మిగిలిన గృహ నిర్మాణ పథకాలను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి రమేష్ అన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. మొదటి దశలో 15.75 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అధికారులు, సిబ్బంది లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. ఏపీ ప్రభుత్వం ‘నవరత్నాలు’ పథకం కింద ఇళ్ళు లేని నిరుపేదలకు రెండు దశల్లో 30 లక్షల ఇళ్లను నిర్మిస్తోంది. కాగా హడ్కో ఒక ప్రత్యేకమైన సంస్థ. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. హడ్కో దేశంలో హౌసింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రంగంలో ప్రధానమైన టెక్నో-ఫైనాన్సింగ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. ప్రధానంగా పేద ప్రజలకు గృహలను నిర్మించడంలో ప్రభుత్వంతో కీలక భాగస్వామిగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ