దారి తప్పిన రాజకీయానికి ప్రత్యామ్నాయంగా అంటూ లోక్ సత్తా పార్టీని స్థాపించి.. అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు.. డా.జయప్రకాష్ నారాయణ. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీలు పారదర్శకంగా, జవాబుదారీ తనంతో ఉండేలా సంస్కరించేందుకు ప్రయత్నించారు. తదనంతర కాలంలో డబ్బుతో నడిచే రాజకీయాలతో పోటీపడలేక.. పోటీ నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ.. దేశ, రాష్ట్ర రాజకీయాలను నిరంతరం పరిశీలిస్తూ.. ముఖ్య ఘటనలపై స్పందిస్తున్నారు. తగిన సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఏపీ రాజకీయాలు.. అధికార పార్టీ వైసీపీ పాలనపై జేపీ గా ప్రసిద్ధి పొందిన జయప్రకాష్ నారాయణ గతంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలన మీద ప్రశంసలు కురిపించారు.
విద్యా, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను జేపీ గతంలో మెచ్చుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ వంటి విధానాలను సైతం ఆయన అభినందించారు. పేద ప్రజల సంక్షేమానికి కచ్చితంగా డబ్బు ఖర్చుపెట్టాలన్న జేపీ.. ఏపీలో మధ్యవర్తుల ప్రమేయం, లంచాల అవసరం లేకుండా చివరి గడపకు కూడా సంక్షేమ పథకాల లబ్ధి అందుతోందని గతంలో వ్యాఖ్యానించారు. అలాగే వైఎస్ జగన్ను జేపీ ఓ సందర్భంలో కలవడంతో.. ఆయన వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు జేపీ ప్రకటించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి రాష్ట్రానికి మేలు చేస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలకు అవకాశం కల్పిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. ప్రజలు, మేధావులు, రైతులు ఆలోచించి రాష్ట్రానికి, పిల్లలకు మంచి భవిష్యత్తును చూపించే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కమ్మ.. కాపులకు, రెడ్లకు మధ్య పోరాటం జరుగుతుందన్న చర్చ సాగుతోందన్నారు.
అప్పులు తెచ్చి సగం జీతభత్యాలకు, మరికొంత కైంకర్యం చేసి, కొంత దుబారా చేసి, మిగిలిన నిధులను సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సమాజంలో సంక్షేమం అవసరమేనని, దానికి ఒక పరిమితి ఉండాలని చెప్పారు. పాలకులు ప్రజల సొమ్మును తమ సొమ్ముగా భావిస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం పుచ్చుకోవడం కాకుండా ఎప్పుడూ సంపాదించుకోవడం అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పేదరికం తొలగిపోయే విధానాలు అమలు చేయకపోతే ప్రజలే నష్టపోతారన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న ఏ తప్పును ఎత్తి చూపినా వెంటనే కులం, మతం, ప్రాంతం తెరపైకి తెస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న వారు నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మద్దతుగా ఉంటే పూలబాట వేసి, ప్రత్యర్థిగా ఉండే ముళ్లబాటగా మారుస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓట్లు వేసే అవకాశం ఉంటుందా? అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోందన్నారు. పేద రాష్ట్రంగా ఉన్న ఒడిసా కన్నా దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. అసమర్థులు, అవినీతిపరులు పాలకులుగా ఉన్నప్పుడు సంస్కరణలు సాధ్యం కావని చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం ఉండి రెవెన్యూ పెంచుకోలేకపోయారని ఆక్షేపించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఉపాధి లేవన్నారు. 20శాతం ఉండాల్సిన అప్పులు 43శాతానికి పెరిగాయన్నారు. ఉద్యోగుల బకాయిలు కలిపితే 50శాతానికి అప్పులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని వైసీపీ నిర్వీర్యం చేసిందని, ఈ పరిస్థితుల్లో కూటమి విజయంతో రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. హఠాత్తుగా జేపీ స్వరం మారడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కూటమిలో మాత్రం ఉత్సాహం నింపుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE