ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. ఏపీ రైతులు ఖరీఫ్ పనులను ప్రారంభించేందుకు వీలుగా మొత్తం డెల్టాకు సుమారు 1,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇందులో కృష్ణా తూర్పు డెల్టాకి 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకి 500 క్యూసెక్కులు సాగునీరు విడుదలైంది. కృష్ణా డెల్టా చరిత్రలో ప్రభుత్వం ముందుగానే సాగునీటిని విడుదల చేయడం, అది కూడా నెలరోజుల ముందే విడుదల చేయడం విశేషం. ఇక కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉండగా, ఈ ఆయకట్టు కింద సుమారు 10.13 ఎకరాల భూమికి సాగునీరు లభించనుంది. అలాగే మరోవైపు పులిచింతల రిజర్వాయరులో నీరు సమృద్ధిగా ఉండటంతో దాదాపు 35 టీఎంసీల సాగునీరు దీనిద్వారా అందుబాటులోకి వచ్చింది.
ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో ఈసారి ఋతు పవనాలు ముందుగా వస్తాయని వాతావరణశాఖ తెలుపుతోందని, ఇది రైతులందరికీ శుభసూచకం అని అన్నారు. ఈ సంవత్సరం ఖరిఫ్ పంటలో అధిక దిగుబడి రావాలని కోరుకుంటున్నానని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని పేర్కొన్నారు. దీనికితోడు ముందుగా విడుదల చేయడంతో నవంబర్లో ఖరీఫ్ అనంతరం డిసెంబర్ లో రెండో పంటని కూడా వేసుకునే అవకాశం ఉందని అంబటి తెలిపారు. కాగా కృష్ణా డెల్టాకి ఈ సీజన్ లో సుమారు 155 టీఎంసీల సాగునీరు అవసరమవుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, మంత్రి జోగి రమేష్ , ఎమ్మేల్యే మల్లాది విష్ణు, మేరుగు నాగర్జున తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ