తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయని, అయితే దీనిపై అనవసర ఆందోళన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ (డీహెచ్) డా జి. శ్రీనివాసరావు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నా, ఆస్పత్రుల్లో అంతగా చేరికలు లేవని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులలో పెరుగుదల కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో గత వారంలో 355 కేసులు నమోదు అవగా, ఈ వారంలో 555 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో కేసుల నమోదులో 56% పెరుగుదల కనిపిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్యలో 66% పెరుగుదల కనిపిస్తోందని డీహెచ్ వెల్లడించారు. కరోనా పూర్తిగా పోలేదని, అందునా సబ్ వేరియెంట్స్ కొంత ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే డిసెంబర్ వరకు ఇలాగే ఉండే అవకాశం ఉందని, ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. మరికొన్ని రోజుల్లో వర్షాకాలం రానున్నందున, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని.. జ్వరం, తలనొప్పి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని, అలాగే తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ వ్యాప్తంగా త్వరలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేపట్టబోతున్నామని, 12-18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్ అందుబాటులోనే ఉందని తెలిపారు. మరో 2, 3 రోజుల్లో స్కూల్స్ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో.. తల్లిదండ్రులందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, అలాగే పాఠశాలల యాజమాన్యాలు కూడా శానిటైజేషన్ విషయంలో తగు శ్రాధ వహించాలని శ్రీనివాసరావు హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ