కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా స్థానిక ఎన్నికలు నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ అవుతున్నారు. ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయం సేకరిస్తున్నారు. 19 రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం నుంచి సమాచారం అందగా, ఈ రోజు ఉదయం బీజేపీ, సీపీఎం, బీఎస్పీ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ రమేశ్ కుమార్ వేర్వేరుగా భేటీ అయి అభిప్రాయాన్ని సేకరించారు. ఇతర పార్టీలు కూడా అభిప్రాయాన్ని వెల్లడించనున్నాయి.
మరోవైపు రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ రమేశ్ కుమార్ నిర్వహించే భేటీకి వైస్సార్సీపీ హాజరు కావడం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎస్ఈసీ వ్యవహరిస్తున్నందు వలనే ఆయన నిర్వహిస్తున్న సమావేశానికి వైఎస్సార్సీపీ వెళ్లడం లేదని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీ, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఇచ్చే అభిప్రాయాలతో సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలను అభిప్రాయ సేకరణకు పిలవడంతోనే ఎస్ఈసీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని తెలుస్తుందని, అందువల్లే ఈ సమావేశానికి వెళ్లటం సరైనది కాదని వైఎస్సార్సీపీ భావిస్తుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu