బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నేడు తొలిదశ పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 16 జిల్లాలలోని 71 అసెంబ్లీ స్థానాలలో బుధవారం నాడు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తొలిదశలో సుమారు 2.14 కోట్ల మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. బుధవారం ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 31371 పోలింగ్ కేంద్ర వద్ద ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు థర్మల్ స్కానింగ్ చేస్తూ, హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఈవీఎంలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. మరోవైపు 80 ఏళ్లకి పైబడినవారికి పెద్దలకు, వచ్చి ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ(బీజేపీ- జనతాదళ్ యునైటెడ్) కూటమి, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమి మధ్య ప్రధాన పోటీ నడుస్తుంది. మొత్తం 71 స్థానాలకు గానూ అన్ని పార్టీల నుంచి 1066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక రెండో విడతలో 94 స్థానాలకు నవంబరు 3 న, మూడో విడతలో 78 స్థానాలకు నవంబర్ 7 న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను నవంబర్ 10 న వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu