బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరేందుకు కన్నా సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 23వ తేదీన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరి, పసుపు కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తుంది.
ఆదివారం గుంటూరులోని తన నివాసంలో అనుచరులు, సన్నిహితులతో కన్నా లక్ష్మీనారాయణ కీలక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గతంలో కన్నా జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి, అయితే జనసేన, బీజేపీలు పొత్తులో కొనసాగతుండడంతో జనసేనలోకి కాకుండా, టీడీపీలో చేరేందుకే సన్నిహితులు, అనుచరులు, అభిమానులు సూచించడంతో ఈ దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టీడీపీలో చేరాక కన్నాకు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం లేదా సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఇక బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, 2014లో ప్రధాని మోదీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలో చేరానని, నాలుగేళ్లు సామాన్య కార్యకర్తలా పార్టీలో పనిచేశానని అన్నారు. ఆ క్రమంలో 2018లో పార్టీ అధ్యక్షుడిగా తనను నియమించగా, అప్పటినుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. రాజధాని అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించామని, అలాగే కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. అయితే సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, పార్టీని తన సొంత సంస్థలా నడుపుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE