ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారాన్నే రేపాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శనివారం పవన్ కల్యాణ్కు నోటీసులు జారీ చేశారు. మహిళలు, పెళ్లిళ్ళపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలఫై ఆమె అభ్యంతరం తెలిపారు. తక్షణమే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లక్షలు, కోట్లు భరణం ఇచ్చి ఎవరి స్థాయిలో వారు విడాకులు ఇవ్వవచ్చని పవన్ చెప్పడం ఆక్షేపణీయమని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇలా ఎవరు పడితే వారు భరణం ఇచ్చి భార్యలను వదిలించుకుంటూ పోతుంటే మహిళల జీవితానికి భద్రత ఏముంటుంది? అని కమిషన్ చైర్ పర్సన్ ప్రశ్నించారు.
అలాగే మహిళలను ఉద్దేశించి ‘స్టెప్నీ’ అనే పదం వాడడం దారుణమని, ఇది మహళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళలను ఒక భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఇలాంటి పాదాలను ఉపయోగిస్తారని, అలాంటిది ఒక స్థాయిలో ఉన్న పవన్ లాంటి వ్యక్తులు ఇలా మాట్లాడటం సహించరానిదని ఆమె పేర్కొన్నారు. ఒక సినిమా హీరోగా, ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావం సమాజంపైన ఉంటుందని, ఆయనను అనుసరించేవారు తాము కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చని భావిస్తే, అది సమర్ధనీయం కాదని వాసిరెడ్డి పద్మ చెప్పారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక మంది మహిళలు తమకు ఫిర్యాదు చేశారని, మహిళలను కించపరిచేలా మాట్లాడటం, చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడం వారిని ఆందోళనకు గురిచేశాయని తెలిపారు. అందుకే పవన్ కళ్యాణ్ తక్షణమే మహిళలకు క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY