కేంద్ర ప్రభుత్వంతో పాటుగా పార్టీ యంత్రాంగంలో కూడా పలుమార్పులకు బీజేపీ అధిష్టానం వ్యూహ రచన చేస్తోంది. త్వరలోనే ఎన్నికల టీమ్ తో క్యాబినెట్ లో మార్పు ఖాయమని మోడీ శిబిరం నుంచి లీకులు వస్తున్నాయి. అదే సమయంలో పార్టీ వ్యవహారాల్లో కూడా మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురిని పార్టీ బాధ్యతల్లోకి పంపిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల మార్పు అనివార్యమనే ప్రచారం కూడా సాగుతోంది. తెలంగాణాలో బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి అంటూ వార్తలు వచ్చాయి. అయితే తనకు మళ్లీ పార్టీ బాధ్యతలు వద్దంటూ కిషన్ రెడ్డి విన్నవించారనే కథనాలు వస్తున్నాయి.
తెలంగాణాతో పాటుగా ఏపీ బీజేపీలో సైతం మార్పులు ఖాయమనే ప్రచారం ఉంది. ముఖ్యంగా మళ్లీ టీడీపీకి బీజేపీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో సోము వీర్రాజుకి స్థాన చలనం తప్పదంటున్నారు. సోము వీర్రాజు ఆరంభం నుంచి చంద్రబాబు వ్యతిరేకిగా ముద్రపడ్డారు. జగన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయనే విమర్శలు బీజేపీలోని ఆయన వ్యతిరేక వర్గం చేస్తోంది దాంతో ఇప్పుడు బాబుతో బీజేపీ బంధం బలపడాలంటే సోము అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ఉన్నట్టు చెబుతున్నారు. గతంల కన్నా లక్ష్మీనారాయణని కాదని కాపు కులానికే చెందిన సోము వీర్రాజుకి సారధ్యం అప్పగించారు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి బయటపడి, టీడీపీ కండువా కప్పుకున్నారు.
సోము వీర్రాజు స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సత్యకుమార్ పేరు వినిపిస్తోంది. రాయలసీమకు చెందిన బీసీ కులస్తుడైన సత్యకుమార్ గతంలో వెంకయ్యనాయుడు దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ వ్యవహారాల్లో బిజీగా సాగుతున్నారు. ఇటీవల అమరావతి ఉద్యమం సందర్భంగా ఆయన మీద దాడి యత్నం కూడా జరిగింది. దాంతో పాటుగా ఆయన నిత్యం వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ శిబిరంతో సన్నిహితంగా ఉండే ఆయనకు నిజంగానే పార్టీ నాయకత్వం అప్పగిస్తే బీజేపీ, టీడీపీ బంధం చిగురిస్తుందనడానికి ఓ సంకేతం అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE