ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకం కింద రూ.2,052 కోట్ల నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద వరుసగా మూడో ఏడాది రెండో విడతలో భాగంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ.2,052 కోట్లతో కలిపి రైతు భరోసా కింద ఇప్పటివరకు రైతులకు రూ.18,777 కోట్లు విడుదల చేశారు. ముందుగా 2019 నుంచి రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రూ.13750 అందిస్తుండగా, మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో సంక్రాతి సమయంలో రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు.
ఒకే రోజు మూడు పథకాలు ద్వారా రైతులకు రూ.2190 కోట్లు లబ్ది:
మరోవైపు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 6.67 లక్షల మంది ఖాతాల్లో రూ.112.7 కోట్లు మరియు యంత్రసేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు రూ.25.55 కోట్లను కూడా నేడు సీఎం వైఎస్ జగన్ వారి ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, దీపావళికి వారం ముందే రైతుల కళ్లలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో ఒకే రోజు మూడు పథకాలు ద్వారా రైతులకు రూ. 2,190 కోట్లు లబ్ది చేకూరుస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ, రైతులకు ఇచ్చిన హామీలను వందకు వంద శాతం నెరవేరుస్తూ వస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ