ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో సీట్ల పంచాయితీ గోల ఎక్కువవుతుంది. ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించేసిన సీఎం జగన్.. తుది జాబితా కూడా ప్రకటించి ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. సీఎం జగన్ ఇప్పటికే చాలా అసెంబ్లీ స్థానాల ఇంఛార్జ్లను. లోక్ సభ స్థానాల ఇంఛార్జ్లను నిర్మొహమాటంగా మార్చేసారు. రాబోయే రోజుల్లో మరికొందరిని మార్చి కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు.
మరోవైపు నటుడు, ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ కూడా ఎంపీ అని పిలిపించుకోవాలని తహతహలాడుతుండటంతో..జగన్ కూడా అలీ కోరికను మన్నించడానికే మొగ్గు చూపుతున్నారట. కాకపోతే అలీ ఇష్టంగా అడుగుతున్న గుంటూరు కాకుండా నంద్యాల అయితే ఓకే అంటున్నారట.
2019 అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీలో చేరిన అలీ.. అప్పట్లో వైసీపీ గెలుపుకోసం గట్టిగానే కృషి చేశారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయడంతో..అలి క్యాంపెయిన్ వైసీపీకీ బాగా కలిసొచ్చినట్లే అయింది. ఆ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందడంతో..అప్పట్లో అలీ రాజ్యసభ సీటు కోరికను జగన్ ముందుంచారు.
రాజ్యసభ సీటు కాకపోయినా రాష్ట్రమైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అయినా ఇవ్వాలని కోరారు. కానీ చివరికి సీఎం జగన్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవిని కట్టబెట్టారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండడంతో అలీ మళ్లీ యాక్టివ్ అయ్యారు. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇటు ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ల మార్పుతో అసంతృప్తులు పెరిగిపోవడంతో.. ముస్లిం అభ్యర్ధికి లోక్ సభ ఎంపీ సీటు కేటాయించినప్పుడూ ఇదే సీన్ కనిపిస్తుందా అని జగన్ ఆలోచిస్తున్నారట. ఇప్పటి వరకూ టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచీ ముస్లిం అభ్యర్ధలు లోక్ సభకు, రాజ్యసభకు వెళ్లినా.. వైసీపీలో మాత్రం ఎవరినీ పంపలేదు. దీంతో ఈ సారి లోక్ సభ ఎన్నికలలో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడానికి ఆలోచిస్తున్న జగన్.. దీనికోసం నంద్యాల, కర్నూలు లోక్ సభ సీట్లను పరిశీలించారు.
అయితే కర్నూలులో బీసీ అభ్యర్ధి అయిన మంత్రి గుమ్మనూరు జయరాంకు ఈ సీటును కేటాయించవలసి వచ్చింది. పోనీ నంద్యాలలో ముస్లిం అభ్యర్ధిని నిలబెడదామన్నా.. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేత పోచ బ్రహ్మానందరెడ్డిని కాదని.. అలీకి అవకాశం ఇస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత తప్పదన్న విషయం జగన్కు బాగా తెలుసు. మరోవైపు గుంటూరు స్థానంపై మనసుపడ్డ అలీ నంద్యాల అంటే నో అంటున్నారట.
అలా అని .. అలీ ఎప్పటి నుంచో కోరుకుంటున్న గుంటూరు ఎంపీ సీటు ఇస్తే.. టీడీపీ..ఇటు కమ్మ ఓట్లతో పాటు ఇతర ఓట్లు కూడా అలీకి వ్యతిరేకంగా పోలరైజ్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే గుంటూరు సీటు అలీకి ఇవ్వడానికి వైసీపీ అధినేత ముందుకు రావడంలేదు. మరి ఈ లెక్కను జగన్ ఎలా తేలుస్తారో చూడాలి. మరోవైపు ఇప్పుడు అలీని బుజ్జగించి..తర్వాత రాజ్యసభకు పంపించే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE