కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రాష్ట్ర పార్టీ హోదా అనుభవిస్తున్న బీఆర్ఎస్ (ఒకప్పటి టీఆర్ఎస్) గుర్తింపును ఈసీ కేవలం తెలంగాణకే పరిమితం చేసింది. ఇక బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూడా పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఈసీ నిర్ణయం ఆ పార్టీకి ఒకింత షాక్కి గురిచేసింది. కాగా రాష్ట్ర విభజనకు ముందు టీఆర్ఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. అయితే 2014లో రాష్ట్ర విభజన జరగడం, అప్పటికే ఎన్నికలు పూర్తవడం తదితర పరిణామాల నేపథ్యంలో.. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదాలో కొనసాగింది. కానీ 2019 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయలేదు.
దీంతో ఈసీ నిబంధనల ప్రకారం ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని టీఆర్ఎస్కు 2019 జూలైలో షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. దీనికి ఆ పార్టీ స్పందించలేదు. ఈ క్రమంలో 2021 డిసెంబరు 27న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరై వాదనలు వినిపించాలని మరోసారి అదే నెల 16న, మరియు గత నెల 20న ఇంకోసారి నోటీసులు జారీ చేసినా, ఆ పార్టీ ప్రతినిధులు హాజరు కాలేదని ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే, రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపును కొనసాగించాలని లేఖ రాసిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల గుర్తుల ఉత్తర్వులు, ఎన్నికల్లో పనితీరును పరిశీలించి ఎన్నికల గుర్తుల ఆర్డర్, 1968లోని 6వ పేరాను అనుసరించి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్కు ఉన్న రాష్ట్ర పార్టీ హోదా గుర్తింపును రద్దు చేస్తున్నామని, కేవలం తెలంగాణలోనే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఉన్నట్లుగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు ఇప్పటిదాకా జాతీయ పార్టీల హోదాను అనుభవించిన వామపక్ష పార్టీ సీపీఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లకు ఆ హోదాను తొలగించింది. ఈ మేరకు ఆ పార్టీలకు ఈసీ నుంచి ఉత్తర్వులు అందాయి. గత కొంతకాలంగా వరుస ఎన్నికల్లో నిబంధనల ప్రకారం నాలుగు రాష్ట్రాల్లో నిర్దేశిత విజయాలను సాధించకలేకపోవడంతో ఆయా పార్టీలు ఈ హోదాను కోల్పోయాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మాత్రం ఈసీ జాతీయ పార్టీ హోదాను కల్పించింది. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవాల్లో ఆప్ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. కాగా సాధారణంగా ఎన్నికల నిబంధనలు అనుసరించి ఏదేని ఒక పార్టీ.. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే ఆ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తారు. అలాగే ఒక పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే.. 6 శాతం ఓట్లు 2 సీట్లు గానీ/3 శాతం సీట్లు లేదా 3 సీట్లు గానీ/8 శాతం ఓట్లు కానీ… స్థానిక శాసనసభ ఎన్నికల్లో సాధించాల్సి ఉంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE