ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరొందిన పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల ఖరారుపై మంగళవారం ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జల్శక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర జల్శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో ఈ భేటీ జరుగగా, ప్రాజెక్ట్ ఫైనల్ డిజైన్లకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో గోదావరి నది వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటంపై సమాలోచనలు జరిపారు. అలాగే కొంత మేర డామేజ్ అయిన డయాఫ్రమ్ వాల్ను పటిష్ఠం చేయడంపై సమగ్రంగా చర్చించారు.
ఎగువ, దిగువ కాఫర్ డ్యాములు, డయాఫ్రమ్ వాల్స్ తదితర ప్రధాన కట్టడాలపై చర్చించారు. కాగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుపై రేపు ఆ శాఖ కార్యదర్శి అధ్యక్షతన మరో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టులో ఇంకా పెండింగ్ లో ఉన్న ఇతర అంశాలపై ఈ సమావేశాల తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులతోపాటు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఈనెల 11న సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలోని అధికారుల బృందం పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ