ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ కాపు సామాజికవర్గం చుట్టే తిరుగుతున్నాయి. ఏపీలో 23 శాతం మంది ఓటర్లు కాపులే. అందుకే కాపు సామాజిక ఓటు బ్యాంకును దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. అయితే కాపుల ఓటు బ్యాంకును దక్కించుకునేందుకు వైసీపీ రచిస్తున్న వ్యూహాలన్నీ బెడిసికొడుతున్నాయి. కాపు ఓట్లను దక్కించుకునేందుకు ఏ నేతలనైతే వైసీపీ ఎంచుకుందో.. వారంతా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
కాపు సామాజిక వర్గానికి చెందిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడుని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ద్వారా కాపు సామాజిక ఓట్లను ఆకర్షించవచ్చని అనుకున్నారు. కొద్దిరోజుల క్రితమే తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్లో జగన్ సమక్షంలో అంబటి రాయుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. కానీ పట్టుమని పది రోజులు కూడా కాకముందే.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అంబటి రాయుడు ప్రకటించారు.
అయితే కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఐఎల్టి-20లో ముంబై ఇండియన్స్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అంబటి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రెండు రోజులకే జనసేనాని పవన్ కళ్యాణ్ను అంబటి రాయుడు కలవడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో పవన్తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. ఈక్రమంలో అంబటి వైసీపీలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వైసీపీ తరుపున గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇక కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభంను జగన్ తన పార్టీలోకి ఆహ్వానించారు. ఒక అసెంబ్లీ టికెట్, ఒక ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు గుసగుసలు వినిపించాయి. అటు ముద్రగడ కూడా వైసీపీలో చేరడం ఖాయమని.. రేపో మాపో వైసీపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈసమయంలో ముద్రగడను జనసేన నేతలు కలవడం ఆసక్తికరంగా మారింది. జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడతో సమావేశమై.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
అంతేకాకుండా కాపుల సమస్యలపై పవన్ రాసిన లేఖ గురించి ముద్రగడకు శ్రీనివాస్ వివరించారు. జనసేన-టీడీపీ కూటమిలోకి ముద్రగడ వస్తేనే కాపులకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పారట. అయితే జనసేనలోకి చేరికపై ముద్రగడ సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చారట. పవన్ కళ్యాణ్ తన ఇంటికి వచ్చి ఆహ్వానిస్తేనే.. పార్టీలోకి చేరికపై ఆలోచిస్తానని అన్నారట. అటు పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడను కలిసేందుకు సిద్ధమయ్యారట. రెండు, మూడు రోజుల్లో ముద్రగడను కలవనున్నారట. ఈక్రమంలో ముద్రగడ నిర్ణయం ఎలా ఉండబోతోంది.. వైసీపీ వైపు మొగ్గు చూపుతారా.. జనసేనలో చేరుతారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE