కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన మంత్రి భారతీ, శనివారం మంగళగిరి ఎయిమ్స్ను సందర్శించారు. ఈ క్రమంలో అంతటా కలియతిరుగుతూ వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి పేషేంట్లకు అందుతున్న వైద్య సహాయం, ఇతర సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ కి సంబంధించి ఆస్పత్రిలో ఎక్కడా, ఎలాంటి సైన్ బోర్డులు కనిపించకపోవడంతో, ఎయిమ్స్ సూపరిండెండెంట్ ముఖేష్ త్రిపాఠీని దీనిపై కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయనను నిలదీశారు.
అనంతరం విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ పీఎంజేఏవై నిధులతో నడిచే ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి సంబంధించిన పోస్టర్ పైన ప్రధానమంత్రి ఫోటో లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పథకానికి కేంద్రం నుంచి నిధులు అందుతాయని, అలాంటప్పుడు ప్రధాని ఫోటో ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. ‘ఆరోగ్యశ్రీ’ కార్డు జారీ చేసే ప్రక్రియను, లబ్ధిదారుల ఎంపికను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత స్థానిక సిద్దార్ధ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ‘ఆయుష్మాన్ భారత్’, ఈ-సంజీవని టెలీమెడిసిన్ సర్వీసెస్ హబ్ ను మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా కళాశాలలోని జూనియర్ డాక్టర్లతో కొద్దిసేపు సంభాషించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ