అంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ కూటమి 99 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అభ్యర్థులను మార్చాలని కొన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈక్రమంలో తెలంగాణలో కేసీఆర్ మార్చినట్లుగానే ఎన్నికలలోపు ఏపీలో చంద్రబాబు కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని మేంగో న్యూస్ ముందే వెల్లడించింది. ఊహించినట్లుగానే జాబితాలో మార్పులు మొదలైనట్లు కనిపిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పి.గన్నవరం (ఎస్సీ) నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా జాబితాలో పేరు సంపాదించిన సరిపెల్ల రాజేశ్ అలియాస్ మహాసేన రాజేష్ పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలుస్తోంది.
ఈమేరకు ఆయన మూడు రోజుల క్రితమే ఓ వీడియో విడుదల చేశారు. నాలాంటి వ్యక్తి ఎదుగుతున్నాడంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, నా వల్ల పార్టీకి ఇబ్బంది కలుగుతోంది అంటే పోటీ నుంచి తప్పుకుంటానని ఆ వీడియో ద్వారా వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఆ సీటును వేరే ఒకరికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. రాజేశ్ను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టడంతో జనసేన నుంచి తీవ్రమైన స్థానంలో అసంతృప్తి పెల్లుబికింది. ఎందుకంటే.. యూట్యూబ్ చానెల్ వేదికగా పొలిటికల్ అప్డేట్స్పై తన మార్క్ ఎనాలలిస్ ఇచ్చే మహాసేన రాజేశ్.. ఆ మధ్య పవన్ను, జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాటలు హద్దులు దాటి బూతుల వరకు వెళ్లాయ్. తమ అధినేతను నిందించిన వ్యక్తి కోసం కూటమిలో భాగంగా పనిచేయాల్సి వస్తుందా.. జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోయారు.
ఇటీవల అంబాజీపేట వాసవి కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో జరిగిన సమావేశం సందర్భంగానే వారి ఆగ్రహాన్ని బహరంగంగానే వెళ్లగక్కారు. మహాసేన రాజేశ్కు టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గం ప్రభావం ఇతర ప్రాంతాల్లోనూ పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మహాసేన రాజేశ్ తప్పుకునేలా టీడీపీ అధిష్ఠానం బుజ్జగించినట్లు తెలిసింది. ఈమేరకు చంద్రబాబునాయుడు అక్కడి పరిస్థితులపై రాజేశ్తో, పార్టీ నేతలతో చర్చించారు. కీలకమైన ఎన్నికల సమయంలో తన వల్ల పార్టీ ఆత్మరక్షణలో పడడం సరికాదని, తానే వైదొలగాలని భావిస్తున్నానని రాజేశ్ ఆయనతో చెప్పారు. ఆయనకు ఎదురైన సమస్యపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయనకు భవిష్యత్లో మంచి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అమలాపురం అసెంబ్లీ స్థానం పొత్తులో జనసేనకు వెళ్తే.. అక్కడి మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును పి.గన్నవరంలో నిలపాలని టీడీపీ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పి. గన్నవరాన్ని జనసేనకు కేటాయించే ప్రతిపాదన కూడా ఉందంటున్నారు.
కాగా, జాబితాలో ప్రకటించిన తర్వాత కూడా పి.గన్నవరం అభ్యర్థిని మార్చిన నేపథ్యంలో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థి మార్పుపై నిరసనలు ఉదృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈనేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం ఇప్పటికే పలుచోట్ల అసంతృప్తిగా నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆందోళనలు, అసంతృప్తులు లేకుండా టీడీపీ-జనసేన సాఫీగా ప్రచారం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE