గత ఎన్నికలలో జనసేన నుంచి గెలిచిన ఒకే అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ ఎంత గుర్తింపు పొందారో.. వైసీపీ వైపు వెళ్లాక తనను తాను దిగజార్చుకునే పనిలో ఆరితేరారంటూ స్వయంగా వైసీపీ వర్గాల్లోనే టాక్ నడుస్తోంది. పార్లమెంట్ స్థానం కోసం వైసీపీ అధిష్టానం ఇంకా అభ్యర్థిని ప్రకటించక ముందే రాజోలు శాసనసభ్యులు రాపాక మాత్రం.. తాను అమలాపురం పార్లమెంట్ టికెట్ పై తానే పోటీ చేస్తానని ప్రకటిస్తూ వైసీపీ వర్గీయులకు షాక్ ఇచ్చారు.
ప్రస్తుతం అమలాపురం ఎంపీగా వైసీపీకి చెందిన చింతా అనురాధ ఉండగా రాపాక తన పేరు చెప్పారని ప్రకటించడంతో వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సిట్టింగ్ ఎంపీ అనురాధకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదని ముందే తెలసినా..ఆ సీటు ఎవరికి కేటాయిస్తారంటూ కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమలాపురం ఎంపీగా తనను సీఎం జగన్ మోహన్ రెడ్డి పోటీ చేయమన్నారంటూ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పుకోవడం హాట్ టాపిక్ అయింది.
అయితే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలను ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు అధిష్ఠానం ఇంకా ఎవరికీ ఎంపీ టికెట్ డిసైడ్ చేయలేదంటూ కామెంట్ చేశారు. అయితే జరిగిన తతంగమంతా అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధ ముందే జరగడంతో వైసీపీ వర్గీయుల్లోనే కాదు ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో నిన్నటి నుంచీ రాపాకపై సోషల్ మీడియాలో సెటైర్లు జోరందుకున్నాయి.
వచ్చే జమిలి ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో తమ పార్టీ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్ అదే దిశగా పావులు కదుపుతున్నారు. దీనికోసం అన్ని అసెంబ్లీ,పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జిలను మారుస్తున్న జగన్.. అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధను కూడా మారుస్తారనే ప్రచారం ఇటీవల జరుగుతోంది.
దీంతో అనురాధ కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాను అనురాధ స్థానంలో అమలాపురం ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం ఉంది. కానీ ఎందుకో ఎలీజా మాత్రం దీనికి ఏమాత్రం ఇష్టపడలేదు. దీంతో అమలాపురం ఎంపీగా ఎవరు పోటీ చేస్తారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే జనసేన నుంచి గెలిచిన రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పేరు కొద్దిరోజులుగా వినిపిస్తోంది. జనసేన నుంచి వైసీపీలో చేరిన రాపాకకు ఈసారి రాజోలు అసెంబ్లీ సీటు ఇవ్వకుండా.. అమలాపురం టికెట్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది.
తాజాగా కోనసీమ జిల్లాలో జరిగిన పి.గన్నవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో రాపాక వరప్రసాద్.. తనను ఎంపీగా పోటీ చేయమని జగన్ చెప్పారని చెప్పడం హాట్ టాపిక్ అయింది. అసలు రాపాకకు పదవి తప్ప ఇంకేమీ పట్టవా? అప్పుడేమో పవర్ కోసం జనసేన నుంచి వైసీపీకి జంపయ్యారు.. ఇప్పుడేమో సీఎం జగన్ ప్రకటించక ముందే తనను తాను పరిచయం చేసుకున్నారని వైసీపీ వర్గాలు గుర్రుమంటున్నాయి. మరోవైపు రాపాక రాజకీయాలు ఇలాగే ఉంటాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE