తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈసారి అధికారంలోకి రాని పక్షంలో పార్టీ లో పెనుమార్పులు ఉంటాయనే సంకేతాలు నేపథ్యంలో ఎన్నడూ లేని రీతిలో బాబు శ్రమిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే ఉచిత బస్సు వంటి పథకాలు ప్రకటిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పొత్తుల కోసం మొదటి నుంచీ ఆసక్తి నుంచీ చూపుతున్నారు. ఇప్పటికే జన సేనతో కలిసి పోటీ చేయడం ఖరారైంది. భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి నడిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పొత్తు పార్టీలపై ఫోకస్ పెడుతూనే.. ప్రధానంగా తమ పార్టీని గెలిపించే అభ్యర్థుల కోసం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఇదే పనిలో బాబు ముఖ్య నేతలతో సమాలాచోనలు చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, ప్రతిపాదనలో ఉన్న అభ్యర్థుల బలాబలాలకు సంబంధించి రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగైదు రకాల నివేదికలను ఆయన వడబోస్తున్నట్లు తెలుస్తోంది. ఏదో ఒక నివేదికపై ఆధారపడకుండా రకరకాల మార్గాల ద్వారా సమాచారాన్ని ఆయన సేకరిస్తున్నారు. టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ బృందం కొన్ని ప్రతిపాదనలు అందజేస్తోంది. నాలుగైదు జిల్లాలకు కలిపి నియమించిన జోనల్ సమన్వయకర్తలు కొంత సమాచారం ఇస్తున్నారు. ఇవిగాక పార్టీ సీనియర్ల నుంచి కొన్ని ప్రతిపాదనలు అందుతున్నాయి.
కొత్తగా పార్టీలో చేరుతున్న ముఖ్యులను కూడా కీలక స్థానాల నుంచి పోటీలో నిలిపించేందుకు అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. వీటితోపాటు రెండు మూడు రకాల ప్రైవేటు సంస్థలను నియమించి వాటి ద్వారా కూడా సమాచార సేకరణ జరుపుతున్నారు. అధికార పార్టీని ఢీ కొట్టాలంటే ముందస్తుగా పార్టీ సిద్ధంగా ఉండాలని, ఆ మేరకు 70-80 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అధినాయకత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. సామాజిక సమీకరణాలు, రాజకీయ బలాబలాలు, ప్రజల్లో వారిపై ఉన్న ఆదరాభిమానాలను మరోసారి బేరీజు వేసుకుని చూసుకుంటోంది. వైసీపీ అభ్యర్థుల విషయంలో చేస్తున్న మార్పుచేర్పులను కూడా గమనిస్తోంది. ఉదాహరణకు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట, వేమూరు నియోజకవర్గాల్లో మంత్రులు విడదల రజని, మేరుగ నాగార్జునలను గుంటూరు పశ్చిమ, సంతనూతలపాడుకు మార్చి.. ఇక్కడ కొత్త అభ్యర్థులను వైసీపీ నిలుపుతోంది. టీడీపీకి ఈ రెండు నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు ఇన్చార్జులుగా ఉన్నారు. వైసీపీ కొత్త అభ్యర్థులతో పోలిస్తే వీరిద్దరూ బలంగా ఉన్నారని టీడీపీ నాయకత్వం అభిప్రాయపడుతోంది.
అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ కంటే ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు చంద్రబాబునాయుడు విపరీతమైన కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థులను వెంటనే ఖరారు చేయకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఐవీఆర్ఎస్ విధానం పేరిట ఫోన్ సర్వేలు చేసే పద్ధతి టీడీపీలో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఈసారి కూడా ఇదే అమలు చేస్తోంది. ఫోన్ సర్వేలు రెండు రకాలుగా చేస్తున్నారు. పార్టీ సభ్యులు, నాయకుల నుంచి విడిగా.. సాధారణ ప్రజల నుంచి వేరుగా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల్లో 20-25 నియోజకవర్గాల్లో సర్వేకు సన్నాహాలు చేస్తున్నారు. మదనపల్లె వంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే సర్వే చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి రెండు మూడు పేర్లు పెట్టి వీరిలో ఎవరికి ఎక్కువ మద్దతు ఉందో చూస్తున్నారు. ఈ సర్వే ఫలితాలు నేరుగా చంద్రబాబుకు మాత్రమే అందుతున్నాయి. దీంతో వీటిపై టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ వ్యక్తమవుతోంది.
అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు ఈ స్థాయిలో మేధోమథనం చేయడం ఎన్నడూ చూడలేదని పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఈసారి అధికారంలోకి రాకపోతే జగన్ బిగించే ఉచ్చుకు పార్టీలోను, వ్యక్తిగతంగాను ఇబ్బందులు తలెత్తే అవశాలు మెండుగా ఉంటాయని ఆయన భావిస్తుండడంతో గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపనున్నారు. మరోవైపు జనసేనకు, తమతో కలిస్తే బీజేపీకి ఇచ్చే సీట్ల విషయంలో కూడా చంద్రబాబు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఏదేమైనా ఉమ్మడి పోరు సాగించి జగన్ ను ఎదుర్కుని అధికారంలో రావాలని బాబు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY