ఏపీలో.. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి రాధాకృష్ణ వ్యవహారం కాక రేపుతోంది. గత ఎన్నికల ముందు రాధాకృష్ణ టీడీపీలో చేరారు. అప్పుడే టికెట్ ఆశించినప్పటికీ హైకమాండ్ ఆయన్ను పక్కకు పెట్టేసింది. పార్టీ గెలుపొందాక తగిన నామినేటెడ్ పదవి కట్టబెడుతామని హామీ ఇచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. ఏ పదవీ దక్కలేదు. ఇక త్వరలో జరగబోయే ఎన్నికల్లోనైనా టికెట్ దక్కుతుందని రాధా ఆశించారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ వెళ్లకుండా.. ఇక్కడే ఉండిపోయారు.
కానీ చివరికి వచ్చే సరికి టీడీపీ హైకమాండ్ ఆయనకు బిగ్ షాక్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్లో రాధాకృష్ణను పక్కకు పెట్టి బొండా ఉమకు ఆ టికెట్ కట్టబెట్టింది. దీంతో రాధా అలకబూనారు. మరి ఈ సమయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? టీడీపీని వీడుతారా? అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితులు అయిన వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నానిలు రాధాతో సమావేశమయ్యారు. ఆయనతో మంతనాలు జరిపి వైసీపీలోకి ఆహ్వానించారు.
గతంలో కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీలు.. రాధాను కలిసి వైసీపీలోకి ఆహ్వానించారు. కానీ ఆ సమయంలో టీడీపీ నుంచి టికెట్ దక్కుతుందనే గట్టి నమ్మకంతో రాధా ఉన్నారు. అందుకే వైసీపీలోకి వెళ్లకుండా టీడీపీలోనే ఉండిపోయారు. ఇప్పుడు ఆయనకు టికెట్ దక్కకపోవడంతో మరోసారి వైసీపీ నేతలు రాధాకు టచ్లోకి వెళ్లారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకే దిగేందుకు రాధాకృష్ణ ఆసక్తితో ఉన్నారు. కానీ విజయవాడలోని మూడు నియోజకవర్గాలకు ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటించేసింది.
అందుకే మచిలీపట్నం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ నేతలు రాధాకృష్ణకు సూచించారట. అక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలిచి తీరుతావని ఆయనతో చర్చలు జరిపారట. ఈక్రమంలో తిరిగి వైసీపీలోకి వెళ్లడంపై.. మచిలీపట్నం నుంచి పోటీ చేయడంపై తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రాధా వైసీపీ నేతలతో అన్నారట. మరి వైసీపీలోకి రాధా తిరిగి వెళ్తారా? లేదా? అన్నది చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE