ఐదేళ్ల కాలంలో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీతో వైఎస్సార్సీపీ దోస్తీ కొనసాగిస్తూనే ఉంది. దీనికి మెయిన్ కారణం జగన్ కేసుల భయం ఒకటి కాగా..మరొకటి తాము అడ్డగోలుగా కుంద్రానికి సహకరిస్తున్నాం కాబట్టి..తమ రాజకీయ అవసరాలకు కేంద్రం కూడా సహకరించాలని రెండు పార్టీలు తెర వెనుక చేసుకున్న ఒప్పందం అన్న ప్రచారం గట్టిగానే సాగుతోంది
ఈ ఒప్పందం ప్రకారం… కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కోసం ఒక్క రూపాయి కూడా ఎప్పుడూ సాధించలేదు. కానీ.. తన రాజకీయ అవసరాల కోసం మాత్రం చాలా ప్రయోజనాలు నెరవేర్చుకున్నారన్న వాదన మాత్రం బాగానే ఉంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ .. వైసీపీకి సహకరించడానికి ప్రధాన కారణం మాత్రం కేవలం రాజ్యసభ ఎంపీల లెక్కలే అంటారు రాజకీయ విశ్లేషకులు.
కేంద్రం ఎలాంటి కీలక బిల్లు పాస్ చేయాలనుకున్నా .. రాజ్యసభలో ఎక్కువ ఎంపీలు కలిగిన వైసీపీ అవసరం కేంద్రానికి అవసరం. దీంతో బీజేపీ వైసీపీ ముందు కాస్త తగ్గి వ్యవహరిస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు బీజేపీకి పూర్తిగా వైసీపీ అవసరం తీరిపోయింది. ఎన్నికలు జరిగిన రాజ్యసభ సీట్లలో.. బీజేపీ అత్యధిక సీట్లను గెల్చుకోవడంతో.. ఎన్డీఏకు రాజ్యసభలో పూర్తి బలం చేకూరినట్లు అయింది. వచ్చే నెలలో పదవీ విరమణ చేసే వారి కంటే కూడా ఎక్కువగా బీజేపీ తరుపు అభ్యర్థులు గెలిచారు. అలా కొత్తగా ఎన్నికైన సభ్యులు ఏప్రిల్లో ప్రమాణం చేసిన తర్వాత ..రాజ్యసభలో ఎన్డీఏకు సాధారణ మెజార్టీ వచ్చేస్తుంది.
ఇప్పుడు వైఎస్సార్సీపీకి పదకొండు మంది రాజ్యసభసభ్యులు ఉండగా..ఇకపై వీరి అవసరం బీజేపీకి ఉండదు. అయితే ఇటు వైఎస్పార్సీపీకి బీజేపీతో సన్నిహితంగా ఉండటం తప్ప.. మరో దారి లేదు. ఢిల్లీ పెద్దలు ఏం చేసినా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. బీజేపీని అంటి పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితుల్లో ఉంది. బీజేపీకి ఏమాత్రం ఎదురు తిరిగినా జగన్ పై ఉన్న కేసులను తిరగతోడే ప్రమాదం ఉంది కాబట్టి ఇష్టమున్నా లేకపోయినా బీజేపీకి వంత పాడాల్సిందే. అయితే బలమైన పార్టీలను ఇప్పుడు ఎన్డీఏలోకి ఆహ్వానించాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ… ఇప్పుడు వైఎస్సార్సీపీ అవసరం లేదని ఆ పార్టీని లైట్ తీసుకుంటుందా లేకపోతే..ఎప్పటిలాగే ఆ పార్టీని అక్కున చేర్చుకుంటారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE