తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్కు ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన క్రేజ్ ఉంది . రజనీకాంత్ స్టైల్కు, నటనకు కోట్లాది మంది అభిమానులు ప్రాణాలు ఇస్తారు. దీనికి తోడు రజనీ నటించిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. మరోసారి తలైవా క్రేజ్ను మరింత పెంచేసింది. అయితే సెలబ్రెటీలకు కూడా కొన్ని కొన్ని ఇష్టాలుంటాయన్న విషయం తెలిసిందే. ఇలా రజనీ కాంత్ కూడా అందుకు మినహాయింపు కాదు.
రజినీకాంత్కు క్రికెట్ అంటే చాలా అంటే చాలా ఇష్టమట. కొన్నిసార్లు తలైవా స్టేడియానికి వచ్చి మరీ మ్యాచ్లు చూస్తుండటం చాలాసార్లు చూశాం.అలా గతంలో ముంబైలో జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్కు రజనీకాంత్ హాజరయ్యారు. ఆ ప్రపంచకప్ను టీమిండియా సొంతం చేసుకోవడంతో .. ఆయన చిన్నపిల్లాడిలో తన సంతోషాన్ని వ్యక్తం చేయడం మీడియా హైలెట్ చేసింది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ తేదీ మధ్య జరుగనుంది. ఈ ప్రపంచకప్నకు భారత్ వేదిక కాబోతోంది. అయితే ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు అంటే బీసీసీఐ రజనీకి ప్రత్యేక గౌరవాన్ని కల్పించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అవును.. తాజాగా రజనీకాంత్కు 2023 ప్రపంచకప్ గోల్డెన్ టిక్కెట్ను అందించింది బీసీసీఐ. బీసీసీఐ కార్యదర్శి జై షా సెప్టెంబర్ 19న తలైవాకు ఈ గోల్డెన్ టిక్కెట్ అందించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారిక అకౌంట్లో అనౌన్స్ చేసింది.
బీసీసీఐ కార్యదర్శి జైషా..తలైవా రజినీకాంత్కు ఈ గోల్డెన్ టికెట్ అందించినట్లు బీసీసీఐ తెలియజేసింది. దిగ్గజ నటుడు రజినీకాంత్ .. భాషలు, సంస్కృతులకు అతీతంగా కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రవేశారని బీసీసీఐ ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా చెప్పింది. ఈ ఏడాది జరుగబోయే ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్లకు.. రజనీ కాంత్ వస్తారని చెప్పేందుకు తాము చాలా సంతోషిస్తున్నామని తెలిపింది. విశిష్ట అతిథిగా రజనీకాంత్ ప్రపంచకప్కు హాజరుకానున్నట్లు ప్రకటించింది. గెస్టుగా వచ్చే రజనీకాంత్.. అతిపెద్ద క్రికెట్ సంబరాన్ని మరింత గ్రాండ్గా చేయనున్నారని ట్వీట్ చేసింది. అంతేకాదు తమ ట్వీట్లో రజనీకాంత్కి.. బీసీసీఐ కార్యదర్శి జైషా గోల్డెన్ టిక్కెట అందిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
మరోవైపు రజనీకాంత్కు గోల్డెన్ టిక్కెట్ ఇస్తున్నారు సరే..ఇంతకీ ఈ గోల్డెన్ టిక్కెట్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గోల్డెన్ టిక్కెట్ ఉన్న వాళ్లు 2023 వన్డే ప్రపంచకప్లో.. ఏ మ్యాచ్నైనా సరే స్టేడియంలోని స్పెషల్ వీఐపీ బాక్సు నుంచి ఉచితంగా వీక్షించవచ్చు. అంటే వీరికి అన్ని మ్యాచ్లకు యాక్సెస్ ఉన్నట్లే..అలాగే దీంతో పాటు.చాలా వీఐపీ ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఇప్పటి వరకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు.. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్కు మాత్రమే గోల్డెన్ టిక్కెట్ దక్కాయి. ఇప్పుడు ఈ లిస్టులో తలైవా రజనీ కాంత్ చేరి గోల్డెన్ టిక్కెట్ అందుకున్నారు. దీంతో దక్షిణాది నుంచి 2023 ప్రపంచకప్ గోల్డెన్ టిక్కెట్ అందుకున్న తొలి సెలెబ్రిటీగా రజనీ కాంత్ నిలిచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE