గత ఏడాది జూన్ లో భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. లద్దాఖ్లోని గాల్వాన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. కాగా ఎనిమిది నెలల అనంతరం గాల్వాన్ లోయ ఘర్షణలో తమ సైనికులు కూడా మరణించినట్టు ఎట్టకేలకు చైనా దేశం అధికారికంగా వెల్లడించింది. అయితే భారత్ సైనికులతో జరిగిన ఘర్షణలో ఓ బెటాలియన్ కమాండర్, ముగ్గురు సైనికులు సహా నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని, దళాలకు నాయకత్వం వహించిన ఓ కల్నల్ తీవ్రంగా గాయపడినట్టు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) తెలిపింది. ఈ ఐదుగురికి సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సిఎంసి) గౌరవ పురస్కారాలు అందజేసినట్టు పేర్కొన్నారు.
అదేవిధంగా తాజాగా భారత్-చైనా సైనికుల మధ్య గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన ఓ వీడియోను కూడా చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ విడుదల చేసింది. పలువిడతల చర్చల అనంతరం సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో సైనిక బలగాలను ఇరు దేశాలు ఉపసంహరించుకుంటున్న సమయంలో గాల్వాన్ ఘర్షణలో మరణించిన వారిపై ప్రకటన చేయడం, వీడియో విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వీడియోలో కారకోరమ్ పర్వత ప్రాంతంలో ఇరు దేశాలకు చెందిన దళాలు మాట్లాడుకోవడం, వారి మధ్య వాగ్వాదం, రాత్రి సమయంలో కూడా సైనికులు ఘర్షణ పడ్డట్టు చూపించారు. గాయపడ్డ చైనా సైనికులను చూపిస్తూ, మరణించిన తమ సైనికులకు చైనా ఆర్మీ వందనం చేయడాన్ని ఈ వీడియోలో చూపించారు. మరోవైపు భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలకు సంబంధించిన పరిష్కారం కోసం శనివారం నాడు ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య చైనా భూభాగంలోని మాల్దో పోస్టు వద్ద 10 వ రౌండ్ చర్చలు జరగనున్నాయి. ఇతర ఘర్షణ పాయింట్ల వద్ద బలగాల ఉపసంహరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ