కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో నాలుగు రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నట్టు గమనించడం వలనే ఈ నిర్ణయం తీసుకునట్టు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాలలో ఇటీవల కోవిడ్ కేసుల ఆకస్మిక పెరుగుదలతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరగడం గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ కేంద్ర బృందాలు కరోనా కట్టడి, నిఘా, పరీక్షలు, చికిత్సలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల కృషికి తోడుగా తమవంతు సాయం చేస్తాయని చెప్పారు. సకాలంలో పరీక్షలు జరపటం, సత్వరం చికిత్స అందేలా చూడటం లాంటి పనుల్లో సమర్థంగా వ్యవహరించటానికి, అలాగే ఆ సందర్భంగా ఎదురయ్యే రకరకాల సవాళ్లను ఎదుర్కోవటానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాధికారులకు కేంద్ర బృందాలు మార్గదర్శనం చేస్తాయని తెలిపారు. వివిధ రంగాల నిపుణులతో కూడిన ఈ బృందాలలో ఒక ప్రజారోగ్యనిపుణుడు, ఒక ఎపిడెమియాలజిస్ట్ నిపుణుడు ఉంటారని చెప్పారు.
ఈ నాలుగు రాష్ట్రాలలోనూ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో గరిష్ఠంగా 54,788 మంది కరోనా బాధితులు ప్రస్తుతం చికిత్సలో ఉండగా, ఆ తరువాత మూడు స్థానాల్లో ఒడిశాలో 28,719, చత్తీస్ గఢ్ లో 14,237, జార్ఖండ్ లో 14,096 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య దృష్ట్యా చూస్తే ఉత్తరప్రదేశ్ లో 2,30,414, ఒడిశాలో 1,06,561, జార్ఖండ్ లో 41,656, చత్తీస్ గఢ్ లో 31,503 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో అధిక సంఖ్యలో 3,486 మరణాలు నమోదవగా, ఒడిశా లో 556, జార్ఖండ్ లో 417, చత్తీస్ గఢ్ లో 277 మరణాలు నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రం సమీక్షిస్తూ, అవసరమైన రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపుతూ చర్యలు తీసుకుంటుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu