దేశంలో జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల నిర్వహణపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలుతో పాటుగా విద్యార్థులు కూడా ఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ నెలలోనే నీట్, జేఈఈ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులను అడ్డంపెట్టుకుని పరీక్షలను వాయిదా వేయలేమని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఒత్తిడి తెచ్చిన కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఏన్టిఏ) పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపింది.
దీంతో ఈ రోజు దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 6 వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షకు మొత్తం 8.58 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునట్టు తెలుస్తుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రోజుకు దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగానే ఈ పరీక్షలు రాయనున్నారు. దేశంలో మొత్తం 660 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, విజయవాడ, అమరావతి, చిత్తూరు సహా పలు ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 9 AM-12 PM, మరియు 3 PM-6 PM వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్కానింగ్ నిర్వహించి, మాస్కులు అందజేసిన తర్వాతనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. పరీక్షా కేంద్ర వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా అధికారులు వెల్లడించారు. మరోవైపు సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష జరగనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu