దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణ విషయంలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను జనవరి 31, 2021 వరకు అమలులో ఉండేలా చూడాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. యాక్టీవ్ కరోనా కేసులు మరియు కొత్త నమోదయ్యే కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగుదల, యునైటెడ్ కింగ్డమ్ లో కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్ వెలుగులోకి రావడాన్ని దృష్టిలో ఉంచుకుని, కరోనాపై నిఘా, నియంత్రణ, అప్రమత్తత చర్యలను ఇకపై కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
కంటైన్మెంట్ జోన్లను గుర్తించడం సహా జోన్లలో నిర్దేశించిన నియంత్రణ చర్యలును కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. మరోవైపు దేశంలో అనుమతించబడిన వివిధ కార్యకలాపాలకు సంబంధించి గతంలో సూచించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ (ఎస్ఓపీలు) తప్పనిసరిగా అనుసరించాలని చెప్పారు. నవంబర్ 25, 2020 న కేంద్ర హోంశాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలనే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
నవంబర్ 25 న కరోనా నియంత్రణపై కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలు ఇవే:
- స్థానిక పరిస్థితిని అంచనా వేసిన తర్వాత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రాత్రిపూట కర్ఫ్యూ లాంటి కొన్ని ఆంక్షలు విధించవచ్చు. అయితే కేంద్రం నుంచి ముందస్తు అనుమతి లేకుండా కంటైన్మెంట్ జోన్లకు వెలుపల స్థానికంగా లాక్ డౌన్ మాత్రం విధించకూడదు.
- రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో అక్కడి జిల్లా అధికారుల చేత కంటైన్మెంట్ జోన్ల పరిధులు కచ్చితంగా గుర్తించేట్టు చూడాలి. ఇందుకు సంబంధించి ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలు పాటించాలి. జిల్లా కలెక్టర్లు కంటైన్మెంట్ జోన్ల వివరాలను వెబ్ సైట్ లో ప్రదర్శించాలి. అలాగే ఆ జాబితాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు కూడా పంపాలి.
- కంటైన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర కార్యకలాపాలు మాత్రమే అనుమతించాలి.
- కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కచ్చితంగా అమలు చేయాలి. అక్కడ ప్రజలు బైటికి వెళ్ళటం లేదా లోపలికి రావటాన్ని పూర్తిగా నియంత్రించాలి. నిత్యావసరాలు, వైద్య అవసరాలకు మాత్రమే అనుమతించాలి. ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్ళి పరిశీలించేలా చూడాలి.
- పాజిటివ్ గా తేలిన వ్యక్తులు ఎవరిని కలిసారో గుర్తించి, జాబితాగా తయారు చేయాలి. వారి ఆచూకీ కనిపెట్టి వారిని 14 రోజులపాటుగా క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షించాలి.
- శ్వాస సంబంధమైన వ్యాధులున్నవారికి ఆరోగ్య కేంద్రాలలో లేదా మొబైల్ సేవల ద్వారా లేదా బఫర్ జోన్లలో ఉన్న చికిత్సాకేంద్రాల ద్వారా చికిత్స అందేట్టు చూడాలి.
- కంటైన్మెంట్ జోన్లలో చర్యలను కఠినంగా అమలు చేయటంలో స్థానిక జిల్లా అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలి. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆయా అధికారులను బాధ్యులను చేయాలి.
- రాష్ట్రాలలో మాస్కులు ధరించటాన్ని, చేతుల పరిశుభ్రత ఉంచుకోడాన్ని కచ్చితంగా అమలు చేయాలి. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వ్యక్తులకు జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు.
- రద్దీగా ఉండే మార్కెట్లు, వీకెండ్ సంతలు, ప్రజారవాణా కేంద్రాలలో భౌతిక దూరం పాటించటానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడిగా ప్రామాణిక ఆచరణావిధానాలను జారీ చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటిని తప్పనిసరిగా పాటించాలి.
- సాంఘిక/మత/క్రీడలు/వినోదం/విద్యా/సాంస్కృతిక/మతపరమైన సమావేశాలు హాల్ సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం వరకు, క్లోస్డ్ హాల్స్ లో 200 మంది వ్యక్తులతో అనుమతి ఇవ్వవచ్చు. పరిస్థితిని అంచనా వేయడం ద్వారా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలు క్లోస్డ్ హాల్స్ లో 100 మంది లేదా అంతకంటే తక్కువ మందిని అనుమతించడంతో నిర్ణయం తీసుకోవచ్చు.
- కంటైన్మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలకూ ఆమోదం ఉంది. కొన్ని అంశాలకు మాత్రం కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతి ఉంటుంది.
- హోం మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చిన మేరకే అంతర్జాతీయ ప్రయాణానికి ఆమోదం ఉంటుంది.
- సినిమా థియేటర్లకు 50% సామర్థ్యంతో తెరవడానికే అనుమతి.
- స్విమ్మింగ్ పూల్స్ లో కేవలం క్రీడాకారులకు మాత్రమే అనుమతి.
- బిజినెస్ టు బిజినెస్ వ్యాపారులకోసం మాత్రమే ఎగ్జిబిషన్ హాల్స్ కు అనుమతి.
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమపరిధిలోని కార్యాలయాలలో భౌతిక దూరం పాటించే నిబంధనలు అమలు చేయాలి. వారం వారం పాజిటివ్ ల శాతం 10 శాతాన్ని మించి ఉంటున్నట్టు తేలిన నగరాలలో కార్యాలయాల సమయాలను విడి విడిగా మార్చి అమలు చేయటం, తదితర చర్యల అమలును పరిశీలించాలి. ఒకే సమయంలో హాజరయ్యే ఉద్యోగుల సంఖ్య కనీస స్థాయిలో ఉండేట్టు చూసుకోవటం ద్వాతా భౌతిక దూరాన్ని అమలు చేయాలి.
- రాష్ట్రం లోపలగాని, అంతర్రాష్ట్ర కదలికలపై గాని ఆంక్షలు లేవు.
- రాష్ట్రం లోపలగాని, రాష్ట్రాల మధ్య గాని వ్యక్తుల రాకపోకలకు, సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలూ ఉండవు. విదేశీ సరకు రవాణాకు కూడా ఈ సడలింపు అమలులో ఉంటుంది. ఎలాంటి ప్రత్యేకమైన అనుమతులు గాని, ఈ-పాస్ లు గాని అవసరం లేదు.
- కరోనా బారిన పడేందుకు ఎక్కువ అవకాశమున్న 65 ఏళ్ల వయసు పైబడినవారు, దీర్ఘకాల వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇళ్ళలోనే ఉండడం మంచిది. అత్యవసరమైన పనులు, వైద్యపరమైన అవసరాలకు మాత్రమే ఇళ్లనుండి బయటకు రావాలి.
- ఆరోగ్య సేతు మొబైల్ యాప్ వాడకాన్ని ఎప్పటిలాగే ప్రోత్సహించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ