దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన “ప్రధానమంత్రి సంగ్రహాలయ” అనే కొత్త మ్యూజియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మ్యూజియం లోపలకు వెళ్ళటానికి వీలుగా ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేసిన టికెట్స్ కౌంటర్ వద్ద మొదటి టిక్కెట్ను కొనుగోలు చేశారు. ప్రధాని మోదీ గతంలో వివిధ నగరాల్లో మెట్రో రైడింగ్లో కూడా ఇదేవిధంగా టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే ఆయన ఎప్పుడూ డిజిటల్ చెల్లింపులనే చేయటం విశేషం. కాగా మ్యూజియంలో మొదటగా దేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ జీవితం మరియు సేవలపై ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని నలుమూలల నుండి ఆయనకు లభించిన అనేక బహుమతులు మొదటిసారిగా ప్రదర్శించబడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ మ్యూజియాన్ని.. భారతదేశ గత ప్రధానమంత్రుల వైభవాన్ని చాటేవిధంగా రూపొందించారు. అలాగే వారి వారి పరిపాలనా కాలంలో ఎదురైన వివిధ సవాళ్ల ద్వారా దేశాన్ని ఎలా నడిపించారో తెలిపేలా చరిత్రను నిక్షిప్తం చేశారు. ఇది స్వాతంత్ర్య పోరాట కాలం నుండి ప్రారంభమై భారతదేశ చరిత్ర యొక్క సంగ్రహావలోకనాలను కూడా అందిస్తుంది. తద్వారా గత ప్రధానుల గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు చాటిచెప్పనుంది. ప్రధాన మంత్రులందరి సహకారాన్ని పార్టీలకతీతంగా గుర్తించడమే మార్గదర్శక సూత్రమని ప్రధాని దీనిపై స్పందించారు. ఈ 14 మంది మాజీ ప్రధానుల గురించి దేశంలోని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడానికి ఈ మ్యూజియం అభివృద్ధి చేయబడింది. ఇది వారి భావజాలం లేదా పదవీకాలంతో సంబంధం లేకుండా ప్రధానమంత్రులందరి సహకారాన్ని గుర్తిస్తుంది అని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ