ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు అక్టోబర్ 9, శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. 950 కోట్ల రూపాయల పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన చైబాసా ఖజానా కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించింది. అయితే లాలూ కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయన విడుదల కాలేరు. దుమ్కా ఖజానా కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష పడడం వలన ఆయన జైల్లోనే ఉండనున్నారు. పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించి మొత్తం మూడు కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా నిర్ధారించబడ్డారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఆరోగ్యం సరిగా లేకపోవడం, మరియు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుండడం వలన లాలూ ప్రసాద్ యాదవ్ కొంతకాలం రాంచీ లోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మరోవైపు అక్టోబర్ 28 నుండి బీహార్ లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు లాలూ అందుబాటులో ఉండరు. ఈ ఎన్నికల్లో లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఆర్జేడీ,కాంగ్రెస్ కూటమికి నాయకత్వం వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu