ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం వాషింగ్టన్ డీసీలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో భేటీ అయ్యారు. కమలా హారిస్, ప్రధాని మోదీ భేటీ జరగడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై వారివురూ చర్చించారు. ఆఫ్ఘానిస్తాన్ తో సహా ఇటీవలి ప్రపంచ పరిణామాలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరు దేశాలలోని కోవిడ్-19 పరిస్థితి, ఈ మహమ్మారిని అరికట్టడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను కొనసాగిస్తూ సహకారం అందించుకోవడంపై చర్చించారు. క్లైమేట్ చేంజ్, అంతరిక్ష సహకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ముఖ్యంగా ఎమర్జింగ్ అండ్ క్రిటికల్ టెక్నాలిజీఎస్, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం గురించి కూడా వారు చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ, కమలా హారిస్ సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, అమెరికాలో తనకు, తన ప్రతినిధి బృందానికి అందించిన స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో సహకరించిన అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ సహజ భాగస్వాములని పేర్కొన్నారు. ఇరుదేశాలకు ఒకే విధమైన విలువలు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని, వీటి మధ్య సమన్వయం మరియు సహకారం నిరంతరం పెరుగుతోందన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్గా కమలా హారిస్ ఎన్నుకోబడటం చాలా ముఖ్యమైన మరియు చారిత్రాత్మక సంఘటన అని చెప్పారు. కమలా హారిస్ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి స్ఫూర్తికి మూలమన్నారు. ప్రెసిడెంట్ జో బైడెన్ మరియు కమలా హారిస్ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను తాకుతాయని పూర్తిగా నమ్మకం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కమలా హారిస్ ను భారతదేశ పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. మరోవైపు ఈ పర్యటనలో భాగంగా గురువారం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తో, జపాన్ ప్రధాని సుగా యోషిహైడ్ తో కూడా ప్రధాని మోదీ భేటీ అయి, పలు అంశాలపై చర్చించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ