తొలివిడత రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. అనంతరం సభ మార్చి 13వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సోమవారం ప్రకటించారు. నిరంతర మరియు ఉద్దేశపూర్వక అంతరాయాల కారణంగా ఈ సెషన్ కార్యకలాపాలు సరిగా జరగలేదని ఈ సందర్భంగా జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రెండో విడత సమావేశాలు మార్చి 13వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 13న ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈసారి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటినుండి అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు సభను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు కూడా మరోసారి సమావేశాలను విపక్ష పార్టీల ఎంపీలు అడ్డుకున్నారు.
సోమవారం సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు వెల్లోకి వెళ్లి నినాదాలు చేయడంతో, చైర్మన్ ఆర్డర్ కోసం విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన విపక్ష సభ్యులకు పలుమార్లు పిలుపునిచ్చినప్పటికీ జీరో అవర్ మరియు ప్రశ్నోత్తరాల సమయం రెండూ జరుగలేదు. అదానీపై జేపీసీ కోరుతూ ప్రతిపక్షాలు నినాదాలు చేయగా, ట్రెజరీ బెంచ్లు ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలను మోదీ, మోదీ అని నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. ఇక మరోవైపు రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు ప్రతిపక్షాలు క్షమాపణలు చెప్పాలని సభా నాయకుడు పీయూష్ గోయల్ కోరారు. అలాగే హౌస్లో వీడియో రికార్డ్ చేసినందుకు గత వారం పార్టీ సభ్యుడు రజనీ పాటిల్ను సస్పెండ్ చేయాలన్న తన నిర్ణయాన్ని పునరాలోచించమని కోరిన కాంగ్రెస్ ఎంపీల అభ్యర్ధనపై చైర్మన్ జగదీప్ ధన్కర్ స్పందిస్తూ.. ఈ విషయంలో తాను చాలా ఉదారంగా వ్యవహరించినట్లు చెప్పారు. కాగా షెడ్యూల్ ప్రకారం.. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతున్నాయి. తొలివిడత జనవరి 31న ప్రారంభమై నేటి వరకూ కొనసాగాయి. ఇక నేటినుంచి నెలరోజుల విరామం అనంతరం మార్చి 13వ తేదీ నుంచి రెండో విడత సమావేశాలు ప్రారంభమవనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE