గత కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో తాజాగా రాజకీయ సంక్షోభం కూడా తోడయింది. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భారీ భద్రత మధ్య మంగళవారం సమావేశమైన శ్రీలంక పార్లమెంట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజపక్స తదుపరి అధ్యక్ష పదవి చేపట్టేందుకు ముగ్గురు సభ్యులు నామినేట్ అయినట్లుగా పార్లమెంట్ ప్రకటించింది. ఇప్పటికే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమ సింఘేతో పాటు మరో ఇద్దరు నేతలు బరిలో నిలిచారు. విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్ నేత అనురా దిస్సనాయకేలు కూడా అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జూలై 20వ తేదీన పార్లమెంట్లో ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా ఈరోజు పార్లమెంట్ సమావేశానికి కొన్ని గంటల ముందు విపక్ష నేత సాజిత్ ప్రేమదాస పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. డల్లాస్ అలహప్పెరుమాకు ఆయన తన మద్దతును ప్రకటించారు. అయితే 73 ఏళ్ల విక్రమ సింఘేకు ఆరుసార్లు ప్రధానిగా చేసిన అపార అనుభవం ఉంది. అలాగే 225 సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్లో దాదాపు 100 వరకు స్థానాలున్న అతిపెద్ద పార్టీ ఎస్ఎల్పీపీ ఆయన నాయకత్వానికే మొగ్గు చూపుతోంది. దీంతో నూతన అధ్యక్షుడిగా ఆయన ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కొత్తగా ఎన్నికవనున్న అధ్యక్షుడు 2024 నవంబర్ వరకు పదవిలో కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ