ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రయాణాల నేపథ్యంలో ఈ కొత్తరకాల కరోనా వైరస్ లు ఇతర దేశాల్లోకి లోకి కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ముందుగా గత డిసెంబర్ లో యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) కరోనా వైరస్ స్ట్రెయిన్ భారత్ లోకి ప్రవేశించింది. అనంతరం దక్షిణాఫ్రికా, బ్రెజిల్ కరోనా వైరస్ వేరియంట్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో దేశంలో యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ కరోనా వేరియంట్ల కేసుల సంఖ్య 795 చేరుకున్నట్లుగా మంగళవారం నాడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇన్సాకోగ్ ల్యాబ్లలో జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కొత్తరకం కరోనా వైరస్ లను నిర్ధారణ చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో 81 శాతం శాంపిల్స్ పరీక్షల్లో యూకే కరోనా వేరియంట్ నిర్ధారణ అయిన నేపథ్యంలో యువతకు కూడా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వెంటనే అనుమతించాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. యూకే కరోనా వేరియంట్ ఎక్కువగా యువకులను ప్రభావితం చేస్తుందని, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆ వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తుందని నివేదికలు వస్తున్న నేపథ్యంలో పంజాబ్ లో యువకులకు కూడా వ్యాక్సిన్ పంపిణి చేసేలా అనుమతి ఇవ్వాలని కోరారు. ఇటీవల పంజాబ్ నుండి 401 శాంపిల్స్ కు జీనోమ్ సీక్వెన్సింగ్ జరపగా, ఫలితాల్లో 81 శాతం మందికి యూకే కరోనా వైరస్ సోకినట్టు తేలిందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ