కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి చిక్కుల్లో పడ్డారు. ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ ఉత్తర గోవాలోని అస్సగావ్లో నిర్వహిస్తున్న ఒక హైక్లాస్ రెస్టారెంట్పై వివాదం రేగింది. మరణించిన వ్యక్తి పేరుతో మద్యం లైసెన్స్ను పునరుద్ధరించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అక్రమ పద్ధతుల్లో, నకిలీ పత్రాల ద్వారా ఆమె మద్యం లైసెన్స్ పొందారని న్యాయవాది ఏరిస్ రోడ్రిగ్స్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జూలై 21న గోవా ఎక్సైజ్ కమీషనర్ నారాయణ్ ఎం.గడ్, జోయిష్ ఇరానీ నిర్వహిస్తున్న ‘సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్’కి షోకాజ్ నోటీసు జారీ చేశారు. కాగా ఈ బార్ లైసెన్స్దారు ‘ఆంథోనీ దిగామా’ గతేడాది మే 17న మరణించినప్పటికీ, తాజాగా అతని పేరు మీదే గత నెల 22న జోయిష్ ఇరానీ లైసెన్స్ పొడిగింపు పొందినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో దరఖాస్తుపై ఆంథోనీకి బదులుగా ఇంకొకరు సంతకం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇక ఈ నోటీసుపై వచ్చే 29న విచారణ జరుగనుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను రోడ్రిగ్స్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా పొందగలిగారు. వాస్తవానికి గోవాలో ఏదేని బార్ లైసెన్స్ ఇవ్వాలంటే ముందుగా రెస్టారెంట్ కలిగి ఉండాలని, కానీ గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటికింకా రెస్టారెంట్ లైసెన్స్ పొందని సిల్లీ సోల్స్కు బార్ లైసెన్స్ కట్టబెట్టారని, దీనికి స్థానిక అధికారులు కూడా సహకరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ముంబై విల్లెపార్లేకు చెందిన దిగామా మరణించినట్లుగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన డెత్ సర్టిఫికెట్ కూడా ఆయన రుజువులు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి చిక్కులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ