హిందువులు చాలా మంది దేవుళ్లను పూజిస్తుంటారు. ఒక్కో దేవుడికి ఒక్కో పండుగను జరుపుకొంటూ ఆ దేవుడి అవతారాన్ని పూజిస్తారు.అలా సత్యనారాయణస్వామి వ్రతం చేసుకున్న తరువాత స్వామి వారి చిత్రపటాన్నిఇంట్లోనే ఉంచుకుంటారు. అలాగే వరలక్ష్మీ వ్రతం తరువాత అమ్మవారిని కూడా ఇంట్లోనే పెట్టుకుంటారు. కాని వినాయకచతుర్ధి రోజు గణనాధుని పూజించి… ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన తర్వాత వినాయకుడి ప్రతిమను నీళ్లలో నిమజ్జనం చేస్తారు.అయితే మిగతా దేవుళ్లను నిమజ్జనం చేయరు కానీ గణేషుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు.
వినాయకచవితినాడు .. గణపతి భక్తుల పూజలు అందుకొని ..వారి కోర్కెలు తీర్చడానికి భూమిపైకి వస్తాడని పురాణాలు చెబుతాయి. అలా వచ్చిన వినాయకుడిని తిరిగి స్వర్గానికి పంపించడానికి దగ్గరి మార్గం సముద్రమే కనుక గణేషుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తుంటారని పండితులు చెబుతున్నారు.
వినాయకచవితి భాద్రపద మాసంలో వస్తుంది. అప్పుడు ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోయి పచ్చగా కనిపిస్తుంది. వేసవికాలానికి బీటలు వారిన భూమి.. వర్షపు జల్లులతో తిరిగి ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనంతో పరిమళిస్తుంది. నదులలో నీరు నిండి నిండుగా కనిపిస్తాయి. గణపతి జన్మనక్షత్రానికి అధిపతి అయిన బుధగ్రహానికి ఆకుపచ్చ అంటే చాలా ఇష్టం. గణేషుడికి గడ్డిజాతి మొక్కలంటే చాలా ఇష్టం. అందుకే గణపతికి 21 గడ్డిజాతి మొక్కలను సమర్పించి పూజలు చేస్తుంటారు.దీని వల్ల ఇల్లు, వాతావరణం పచ్చగా కనిపించి మనసుకు ప్రశాంత ఇవ్వడంతో పాటు..పాజిటివ్ వైబ్రేషన్ను తీసుకువస్తుందని చెబుతారు.
గణపతి పూజకోసం మట్టి విగ్రహం, 21 రకాల పత్రిలను ఉపయోగించడం వెనుక మరో కారణం ఉంది. ఒండ్రుమట్టిలోనూ.. గణపతిని పూజించే ఆకులలో కూడా ఔషధ గుణాలుంటాయి. గణపతి విగ్రహాన్ని పూజించేటప్పుడు విగ్రహాన్ని.. ఆకులను తాకడం వల్ల వాటిలో ఉన్న ఔషధితత్వం మనకు చేరుతుంది. విగ్రహాన్ని… పూజించిన పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధగుణాలు చేరుతాయి. మనము ఆ గాలిని పీల్చడం వలన మనకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నవరాత్రుల పూజలు అందుకున్న గణనాథుని విగ్రహాన్ని మేళతాళాలతో ఊరేగించి నిమజ్జనం చేయడంలో జీవన రహస్యం ఉందని పండితులు చెబుతున్నారు. పంచ భూతాల ( భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) మధ్య జన్మించిన ప్రతి జీవి మధ్యలో ఎంత వైభవోపేతమైన.. విలాసవంతమైన… లగ్జరీ జీవితం గడిపినా కూడా చివరకు అంతా పంచభూతాలలో కలిసి పోవాల్సిందే అన్నది ఇందులో నిమిడి ఉంటుంది. ప్రకృతి దైవుడైన మట్టి గణేషుడికి అంగరంగ వైభవంగా నవరాత్రుల పూజలు చేసి మేళతాళాలతో ఊరేగించి నీటిలో నిమజ్జనం చేస్తారు. అంటే ఎంత గొప్పగా బతికిన వారైనా.. చివరికి మట్టిలో కలిసి పోవాల్సిందే అనే ఒకే ఒక్క సారాంశంతో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
అలాగే ఒకప్పుడు కేవలం మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే గణేష్ పూజకు ఉపయోగించేవారు. దీనికి కారణం వర్షాల వల్ల జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టి కోసం చెరువులు, నదులలో దిగి మట్టిని తీయడం వల్ల అందులోని నీళ్లు తేట పడతాయి. దీంతో పాటు నీటిలో నానిన ఒండ్రుమట్టిని తాకితే.. శరీరానికి చాలా మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు.కానీ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడటం, వివిధ రంగులను వాడటంతో నీళ్లు మరింత విషపూరితంగా మారిపోతున్నాయి.
నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడి పూజలో వాడే పత్రిని దగ్గరలో ఉన్న చెరువుల్లో కాని జలాశయాల్లో కానీ నిమజ్జనం చేస్తారు. సాధారణంగా వినాయకచవితి సమయంలో బాగా వర్షాలు పడతాయి. అలా వర్షాకాలంలో ప్రవహించే ఆ నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి. గణేష్ నిమజ్జన సమయంలో నీళ్లలో వదిలిన ఆకులతో నీరు క్రిమి రహితంగా మారిపోతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE