తెలంగాణలో నేటి నుంచి (ఫిబ్రవరి 1, మంగళవారం) పాఠశాలలు సహా అన్ని విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. ముందుగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు, ఇతర విద్యా సంస్థలకు జనవరి 8 నుంచి 16 వరకు ప్రకటించిన సెలవులను జనవరి 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులకు భౌతికంగా తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జనవరి 29న ప్రకటించారు. దీంతో 24 రోజుల తర్వాత నేటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు విద్యాసంస్థల ప్రారంభంతో 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ