కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్, లాక్ డౌన్ అమలు వంటి అంశాలుపై సోమవారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ ఫంగస్ వ్యాధిని కట్టడి చేయడంలో తీసుకోవాల్సిన కార్యాచరణ గురించి సీఎం చర్చించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకోసం గాంధీలో 150 బెడ్లను, ఈ.ఎన్.టి. ఆస్పత్రిలో 250 బెడ్లను, మొత్తం కలిపి 400 బెడ్లను కేటాయించినట్లుగా వైద్యాధికారులు సీఎంకు వివరించారు. బ్లాక్ ఫంగస్ విస్తరిస్తున్నదని, హైదరాబాద్ లో బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించాలంటే, రద్దీని తట్టుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే వున్నవి కాకుండా ఇంకా ఏయే దవాఖానాల్లో బెడ్లను పెంచాలనే విషయాలను సీఎం చర్చించారు. సరోజినీ దేవి ఆస్పత్రిలో 200 బెడ్లు, గాంధీ ఆస్పత్రిలో 160 బెడ్లను బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకోసం తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను 1500 కు పెంచాలన్నారు.
బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం కావాల్సిన డాక్టర్లను యుద్దప్రాతిపదికన నియమించుకోవాలి:
బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకోసం హైద్రాబాద్ లో బెడ్లు కనీసం 1100 వరకు, జిల్లాల్లో 400 వరకు మొత్తం 1500 బెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. బెడ్ల సంఖ్యను పెంచడంతో పాటు, బ్లాక్ ఫంగస్ ను తగ్గించే మందులు ఎంత సంఖ్యలో అవసరమున్నదో అంచనా వేసి దానిమేరకు బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందులను తక్షణమే ఆర్డరివ్వాలని సీఎం తెలిపారు. అందుబాటులో వున్న‘‘పోసకోనజోల్’’ మందు స్టాక్ తక్షణమే పెంచాలని, అందుకు తగు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం కావాల్సిన డాక్టర్లను యుద్దప్రాతిపదికన నియమించుకోవాలని సీఎం అన్నారు.
కరోనా కట్టడికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది:
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘రాష్ట్రానికి పక్క రాష్ట్రాల నుంచి అటు కరోనా ఇటు బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం తరలి వస్తున్నారు. రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు వాస్తవమే. అయితే కరోనా చికిత్స విషయంలో నాలుగు కోట్లుగా కాకుండా అది పది కోట్లుగా అంచనా వేసుకోవాలి. మనకు ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే వాళ్లకు కూడా చికిత్సను అందజేయంది తప్పేటట్టు లేదు’’ అని సీఎం అన్నారు. కరోనా కంట్రోల్ చేయడానికి మించిన ప్రాధాన్యత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని, ఎన్ని కోట్లయినా ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా వుందని, అవసరమైతే అప్పు తెచ్చయినా కరోనా కట్టడికి సిద్దంగా వుంది’’ అని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. అటు కరోనా ఇటు బ్లాక్ ఫంగస్ తో మొత్తం వ్యవస్థ దీనావస్థలో, భయానక పరిస్థితుల్లో వున్నది. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ, యంత్రాంగంతో పాటు, ప్రైవేటు వైద్య రంగం, ఇతర రంగాలు కూడా మానవతా దృకృథంతో స్పందించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ