ఇటీవల ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభ తర్వాత, మహారాష్ట్రలోని నాందేడ్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు తన రెండో సభను నిర్వహించనుంది. తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే కావడంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పార్టీ భావిస్తోంది. జాతీయ స్థాయిలో దీని గురించి చర్చ జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో నాందేడ్ పట్టణంతో పాటు సభాస్థలికి వెళ్లే దారుల వెంబడి భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్ సహా మరికొందరు పార్టీ కీలక నేతలు నాందేడ్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభా వేదికపై అతిథుల కోసం ఏర్పాటు చేయనున్న సీటింగ్, పార్కింగ్ స్థలం వద్ద ట్రాఫిక్ నియంత్రణ వంటి కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాగా ఈ సభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగం ఎలా ఉండనుంది? ఏఏ అంశాలను లేవనెత్తనున్నారు? అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ నాందేడ్లోని ప్రసిద్ధ గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సందర్భంగా నాందేడ్ ప్రాంతానికి చెందిన కొందరు ముఖ్య నేతలు పార్టీలో చేరతారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. నాందేడ్ జిల్లా తెలంగాణకు సమీపంలో ఉన్నందున తెలుగు మాట్లాడే ప్రజలు గణనీయమైన సంఖ్యలో ఉన్నందున నాందేడ్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నినాదం ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అని ఇప్పటికే పునరుద్ఘాటించిన కేసీఆర్, మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా జరుగుతున్నాయని ఒక సందర్భంలో చెప్పారు. దీంతో నేడు నాందేడ్ సభలో ఆయన ప్రసంగం ప్రధానంగా రైతుల సమస్యలపైనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే త్వరలో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో కూడా బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తరపు ప్రతినిధిగా లలన్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సహా మరికొందరు జాతీయస్థాయి ప్రముఖులు హాజరుకానున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అలాగే బహిరంగ సభకు ముందు, అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని తెలంగాణ కొత్త సచివాలయ సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా వారు పాల్గొననున్నారు. వేద పండితులు సూచించిన శుభ ముహూర్తం ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య బీఆర్ అంబేడ్కర్ పేరుతో నిర్మించిన సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE