నల్లగొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటూనే ఉంది. కాంగ్రెస్లో సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పేరు సంపాదించుకున్నారు. అలాగే వెంకట్ రెడ్డి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన పొలిటికల్ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచే తన పొలిటికల్ కెరీర్ను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. భువనగిరి లోకసభ నియోజకవర్గం నుంచి 2009లో పోటీ చేసి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,978 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2016 నుంచి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా కోమటిరెడ్డి పని చేశారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి స బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అయితే రాజకీయ ప్రయోజనాలను ఆశించి 2022 ఆగష్టు 2న కాంగ్రెస్కు, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరారు. మునుగోడులో 2022, ఆగష్టు 21న జరిగిన ఆత్మగౌరవ సభలో కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు ఆయన. అయితే 2022లో బీజేపీ నుంచి మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి పోటీ చేయగా.. సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి చేతులి ఓటమిని చవి చూశారు.
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విషయానికి వస్తే.. మునుగోడు బైపోల్ ఎన్నికల సమయంలో తన ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా అఫిడివేట్లో వెల్లడించారు. అందులో తనకు రూ.61.5 కోట్లు అప్పులు కూడా ఉన్నాయని ఆయన ప్రకటించారు. అలాగే ఆస్తుల వివరాలలో.. స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లుగానూ, చరాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా 2023 జూలై 5న బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది. అయితే బీజేపీలో ఉంటున్నా కూడా మునుగోడు క్యాడర్ రాజగోపాల్ రెడ్డిని ఎందుకో కాస్త దూరం పెడుతూనే వచ్చింది. అప్పటి నుంచి బీజేపీతో ఉన్నా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు.
చివరకు పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనిపించడం మానేశారు. దీంతో పార్టీ మార్పుపై ప్రచారం ఊపందుకోగా అలాంటిదేమీ లేదంటూ కొట్టి పడేస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. తన అనుచరుల అభిప్రాయంతో మనసు మార్చుకుంటున్నట్టు తిరిగి సొంత గూటికే వెళతానని చెప్పి షాక్ ఇచ్చారు.
తెలంగాణలో బీజేపీ కంటే కాంగ్రెస్ బాగా పుంజుకోవడంతో పాటు.. అక్కడ తనకు పెద్దగా విలువ లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్లోకే వెళ్లిపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. నవంబర్ 30 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడానికి మరోసారి ప్రయత్నిస్తున్నారు. అయితే పోయిన గౌరవాన్ని మళ్లీ సాధిస్తారో లేక యూ టర్న్ రాజకీయాలు మంచివి కావనే సందేశాన్ని అందిస్తారో చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE