ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు (మార్చి 15, బుధవారం) నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023 ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. తెలంగాణలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించగా, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదనే నిబంధన దృష్ట్యా 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ కోసం ఒక్కో కేంద్రానికి అధికారులను నియమించి అన్ని నియమాలు సక్రమంగా అమలయ్యేలా, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, సమస్యలను వెంటనే పరిష్కారించేలా పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు. ఈసారి తెలంగాణలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,82,677 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 4,65,022 మందితో మొత్తం 9,47,699 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఏపీలో కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించని నిబంధనను అమలు చేస్తున్నారు. ఏపీలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్ పరీక్షల కోసం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఏపీలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,84,197 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,19,793 మందితో మొత్తం 10,03,990 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE