కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పదవే తనను అందుకుంటుందని, తాను పదవుల రేసులో లేనని అంటూనే తెలంగాణకు నేను ముఖ్యమంత్రిని కావొచ్చు అని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి రేసులో తాను కూడా ఉన్నానంటూ ఆయన సంకేతాలిచ్చారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడులో బహిరంగసభలో మాట్లాడుతూ, రాజకీయాల్లో 55 ఏళ్ల సీనియారిటీ కలిగిన తాను ముఖ్యమంత్రిని కాకున్నా అయినట్లేలెక్క అన్నారు. అంతేకాదు. మీరు కోరుకుంటున్నట్లుగా నాకు తెలియకుండానే ఆ అవకాశం కూడా హటాత్తుగా రావచ్చునన్నారు. 36 ఏళ్ల వయసులోనే మంత్రి అయిన తాను నిర్వహించినన్ని మంత్రి పదవులు ఏ ముఖ్యమంత్రి కూడా చేయనందున తాను ముఖ్యమంత్రికిందే లెక్క అన్నారు.
జానా రెడ్డి నల్గొండ జిల్లాలోని చారిత్రక నాగార్జున సాగర్ సమీపంలోని అనుముల గ్రామంలో జన్మించారు . ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో జానారెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1983లో నల్గొండ జిల్లా చలకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. అక్కడి నుంచి రాజకీయంగా ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అదే చలకుర్తి నుంచి అసెంబ్లీకి ఏడుసార్లు తిరిగి ఎన్నికయ్యారు. మంత్రి పదవులు అనుభవించడంలోనూ ఆయన రికార్డు సృష్టించారు. . తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కువ కాలం కేబినెట్ మంత్రిగా పనిచేసిన గుర్తింపు జానాకు ఉంది. 1988లో 30 మంది క్యాబినెట్ మంత్రులను బహిష్కరించడంపై ఎన్టి రామారావుతో విభేదించి జానా రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధికి పాటుపడ్డారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయిన అప్పటి అధికార తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ లో క్రియాశీల పాత్ర పోషించారు. జానా రెడ్డి 2004 ఏపీ కేబినెట్లో కాంగ్రెస్ పార్టీకి చేసిన ప్రగతిశీల కృషికి హోంమంత్రిగా ప్రమాణం చేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన చురుకుగా వ్యవహరించారు.
అంతటి అనుభవం ఉన్న నేత తాజాగా పదవుల విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆయన పోటీ లేరనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోటీ చేయకుండా ముఖ్యమంత్రి అవుతారా అన్న ప్రశ్నకు బదులిస్తూ పీవీ నరసింహారావు పోటీ చేయకుండానే ప్రధాని కాగా లేనిది తానెందుకు సీఎం కాలేనన్నారు. నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తున్న తన కొడుకు జైవీర్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడని, తనకు ముఖ్యమంత్రి పదవి వస్తే బాధ్యతలు చేపట్టాక ఆర్నెళ్లలోగా తన కొడుకు రాజీనామా చేస్తాడని చెప్పుకొచ్చారు. ప్రజల కోరిక అంటూ జానారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇదే సందర్భంలో ఇంకో విషయాన్ని జానారెడ్డి మరిచిపోయినట్లున్నారు. గతంలోనూ తాను చేసినన్ని అభివృద్ధి పనులు ఎవరూ చేయలేదని,తాను కూడా ఇంకా ఎన్నికల హామీలు ఇవ్వనని ప్రజలే ముందుకొచ్చి తనను గెలిపించుకుంటారని అతి నమ్మకానికి పోయిన జానారెడ్డి ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిగా నిలిచిన గుండెబోయిన రామ్మూర్తియాదవ్ చేతిలో ఓడిపోయారు బహుశా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల గతంలో జరిగిన నష్టాన్ని మరిచినట్టున్నారన్న విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE