వేసవిలో మంచి నీటి సమస్యల మీద ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద సంబంధిత అధికారులు, సర్పంచులతో హైదరాబాద్ మిషన్ భగీరథ కార్యాలయం నుండి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచుల నుంచి ఆయా గ్రామాల మంచినీటి సరఫరా పై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడిన సర్పంచులు నీటి సరఫరా అద్భుతంగా ఉందని చెప్పారు. కొందరు మారు మూల గ్రామాల సర్పంచులు అక్కడక్కడ కొన్ని లీకేజీలు ఉన్నాయని తెలిపారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారులను అదేశించారు. ప్రజలకు ఏలాంటి సమస్యలు రాకుండా, లేకుండా నూటికి నూరు శాతం నీటిని అందించి సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి అదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత నీటిని అందరికీ అందేలా సర్వసన్నద్ధంగా ఉండాలని అన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ, సమన్వయం చేస్తూ, తగిన విధంగా అధికారులు పని చేయాలని సూచించారు. “నీటి నిల్వలు ఉంచుకోవాలి. పంపుల నిర్వహణ, లికేజీలు లేకుండా చూసుకోవడం, ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్, సమస్యలు ఉత్పన్నం అయితే, ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలి. మనకు రాబోయే నాలుగు నెలల వరకు రిజర్వాయర్ లలోకి కొత్త నీరు రాదు. కాబట్టి ఈ నాలుగు ఐదు నెలలకు సరిపడా నీరు సోర్స్ లలో వుండేటట్లు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి. ఏమైనా ఇబ్బందులు ఉంటే, అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలి. రిజర్వాయర్ లో నీళ్లు డెడ్ స్టోరేజ్ కంటే తగ్గినప్పుడు ఒక రకమైన వాసన మరియు రంగు వస్తుంది. అలాంటి సందర్భము వస్తే తగిన విధముగా నీళ్లను శుభ్రపరచిన తర్వాతనే ప్రజలకు అందివ్వాలి. ఈ ఎండాకాలంలో కరెంట్ కు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే జిల్లా స్థాయి ఎలక్ట్రిసిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే రెక్టిఫై చేసుకోవాలి. ఇందుకు గాను జిల్లా స్థాయిలో ఎలక్ట్రిసిటీ అధికారులతో ఒక కమిటీ వేసుకోని ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి” అని చెప్పారు.
ఈ ఎండాకాలంలో ఏ గ్రామంలో కూడా నీటి ఎద్దడి రావద్దు:
అలాగే పైప్ లైన్ లీకేజీలు వాల్వ్ లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలి. మిషన్ భగీరథకు సంబంధించిన జలాశయాలను, అన్ని రకాల ట్యాంకులు, సంపులు, ఫిల్టర్ బెడ్ లను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి. కొందరు వ్యవసాయానికి కానీ, ఇతర అవసరాలకు నీళ్లను పైప్ వాల్వ్ దగ్గర నుండి మళ్లింపు చేసే అవకాశం వున్నది. దీన్ని నివారించాలి. ఒకవేళ ఏదో ఒక కారణం చేత (పైప్ లైన్ లీకేజీ వల్ల కానీ) ఒక గ్రామానికి బల్క్ వాటర్ రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. మండల స్థాయిలో మండల అధికారులతో ఒక కమిటీ వేసి ఆ రోజు బల్క్ వాటర్ రాని గ్రామాలకు వేరే ఏర్పాట్లు త్వరగా చేసే విధముగా చర్యలు తీసుకోవాలి. ఈ ఎండాకాలంలో ఏ గ్రామంలో కూడా నీటి ఏద్దడి రావద్దు. అలాగే మళ్ళీ స్కూల్ లు తెరిచే లోపు అన్నీ స్కూళ్లకు రెసిడెన్సీయల్ స్కూల్స్ తో సహ మిషన్ భగీరథ నీళ్ళు అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి రోజు రెండు సార్లు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలి. గ్రామ సర్పంచ్ మరియు ప్రజా ప్రతినిధులతో టచ్ లో ఉండి ప్రతి గ్రామానికి సంబంధించి తాగునీటి సరాఫరా తీరు తెలుసుకోవాలి. గ్రామాల్లోని సర్వీస్ ట్యాంకుల్లో గ్రామ పంచాయితీ సిబ్బంది సరైన మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలిపేలా చూసుకోవాలి. గ్రామ సర్వీస్ ట్యాంకులను ప్రతీ పది రోజులకు ఒకసారి శుభ్రపరిచేలా చూడాలి. అంతర్గత పైప్ లైన్స్ లో ఎలాంటి లీకేజీలు లేకుండా చూడాలి. ఎక్కడైనా ఉంటే వెంటనే మరమ్మత్తులు అయ్యేలా చూడాలి. ఇంకా నల్లలు రాని చోటు ఏమైనా ఉంటే వెంటనే ఇంటింటికి నల్లాలు పెట్టాలి” అని మంత్రి సూచించారు.
మిషన్ భగీరథను సుదీర్ఘ కాలం నిలపాలి:
“మిషన్ భగీరథ ద్వారా నీటి సంబంధ విష జ్వరాలు అన్నీ రాకుండా పోయాయి. అలాగే వైకుంఠ ధామాలకు మిషన్ భగీరథ మంచినీరు అందించాలి. ఇంకా బోర్లు, మోటార్ల వినియోగాన్ని తగ్గించాలి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం సమయంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రచార సాధనాల్లో వచ్చే వార్తలకు కూడా గట్టి సమాధానం చెప్పాలి. ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు సీఎం కేసీఆర్ మేధోమథనం చేసి, అధికారులంతా శ్రమకోర్చి పూర్తి చేసిన మిషన్ భగీరథను సుదీర్ఘ కాలం నిలపాలి. కేంద్రం నయా పైసా ఇవ్వకున్నా, మన డబ్బులతో మనం చేసిన గొప్పగా విజయవంతమైన పథకం ఇది. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రతి బడికి, బడి లోని కిచెన్ కు, టాయిలెట్స్ కి, మంచినీటికి ఇతర అవసరాలకు కూడా మిషన్ భగీరథ నీటిని విధిగా అందించాలి” అని మంత్రి ఎర్రబెల్లి అధికారులను అదేశించారు.
మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలు, 1లక్షా 50 వేల కి. మీ.మేర పైప్ లైన్ ఉందన్నారు. సీఎం కేసీఆర్ అనుకున్న స్థాయిలో చేయగలిగాం అంటే అది, మిషన్ భగీరథ అధికారుల సంఘటిత శక్తి, సహకారం, శ్రమ వల్లే 100 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. అయినా, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని చెప్పారు. వచ్చే ఎండాకాలం సవాల్ గా ఉంటుందని, అంతా కలిసికట్టుగా పని చేసి వంద శాతం ప్రజలకు ఇంటింటికీ మంచినీటిని అందిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. మిషన్ భగీరథ అధికారులు సొంత పనులు మానుకొని, కేవలం మంచినీటి సరఫరా మీదే దృష్టి పెట్టాలని స్మితా సబర్వాల్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ