సిద్దిపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించేందుకు 100 పడకలతో సిద్ధం చేసిన ప్రత్యేక కోవిడ్ ఐసొలేషన్ బ్లాక్ ను జూలై 15, బుధవారం నాడు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ఈ కోవిడ్ ఐసొలేషన్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు, స్టాఫ్ నర్స్ లు, పారిశుధ్య సిబ్బందికి పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ బ్లాక్ లో పని చేసే స్టాఫ్ నర్స్ లకు 500 ఫేస్ ప్రొటెక్షన్ మాస్క్ లు అందిస్తామని చెప్పారు. కరోనా బాధితుల సంఖ్యకు అనుగుణంగా సరిపడినంతగా వైద్యులు, స్టాఫ్ నర్స్ లను పెంచుతామని అన్నారు. కరోనా బాధితులకు అందించే ఆహారం, ఇతర అంశాల ఏర్పాట్ల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే కరోనా మరణాల రేటు తెలంగాణలో చాలా తక్కువ ఉందని అన్నారు. ప్రారంభించిన కోవిడ్ ఐసొలేషన్ బ్లాక్కు 28 మంది వైద్యులు, 150 మంది స్టాఫ్ నర్సులను నియమించినట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ గా తేలి లక్షణాలు లేని వారికి, అలాగే హోంఐసొలేషన్ లో ఉండడానికి తగిన ఏర్పాట్లు చేసుకోలేని వారిని ఈ బ్లాక్ కు తరలించి వైద్య సేవలు అందిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu