తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఈ-హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముందుగా ములుగు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టి రెండు జిల్లాల ప్రజల హెల్త్ ప్రొఫైల్ ని సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం నాడు ములుగు జిల్లాలో “తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు”ను ప్రారంభించారు. ములుగు జిల్లా కలెక్టరెట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిహెచ్ శ్రీనివాస్ రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు పలువురికి ఇ-హెల్త్ కార్డులను అందజేశారు.
అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ఆదివాసీ జిల్లా అయిన ములుగులో ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. దేశంలోనే ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా జరగలేదని, అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాల్లో మాత్రమే ఈ విధానం ఉందని అన్నారు. తాజాగా ములుగు జిల్లా రికార్డ్ సొంతం చేసుకుందని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగు, సిరిసిల్లలో ప్రారంభిస్తున్నాం. ఈ రెండు జిల్లాల్లో 40 రోజుల్లో ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి హెల్త్ ఫ్రొఫైల్స్ ను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.
“ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని పూర్తిగా సేకరించనున్నారు. అక్కడికక్కడే వెంటనే వారికి ఒక హెల్త్ ఐడీని క్రియేట్ చేసి, వారి ఆరోగ్య సమాచారాన్ని అందులో అప్ లోడ్ చేయనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ హెల్త్ ప్రొఫైల్ పేరుతో మొబైల్ యాప్ను తయారు చేసింది. హెల్త్ ప్రొఫైల్ లో కూడా ఒక వ్యక్తి యొక్క సమస్త ఆరోగ్య సమాచారాన్ని పొందుపరచనున్నారు. ఎప్పుడు పుట్టారు, ఎత్తు, బరువు, శరీర కొలతలు, గుండె కొట్టుకునే తీరు, రక్త వర్గం, జ్వరం, బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు వివరాలు, దీర్ఘకాలిక వ్యాధులు వివరాలు, ప్రస్తుతం ఎలాంటి చికిత్స తీసుకుంటున్నారు వంటి వివరాలన్నీ పొందుపరచనున్నారు. ఆరోగ్య వివరాల సేకరణ తర్వాత సర్వే చేయబడ్డ వ్యక్తులకు హీమోగ్లోబిన్, ఆర్బీఎస్ టెస్టులు నిర్వహిస్తారు. రక్త, మూత్ర నమూనాలను సేకరించి ప్రైమరీ హెల్త్ సెంటర్లకు పంపి టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలను ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తారు” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో18 ఏళ్లకు పైబడినవారు 3.80 లక్షల మంది, ములుగు జిల్లాలో 2.60 లక్షల మంది ఉన్నారని, రెండు జిల్లాలకు కలిపి మొత్తం 420 పైగా బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒక్కో బృందంలో ఒక ఏఎన్ఎం, ముగ్గురు ఆశా కార్యకర్తలు ఉండనున్నారు. ఒక్కో బృందం ఒక రోజుకు కనీసం 40 మందికి పరీక్షలు చేస్తారని, ఇలా 40 రోజుల్లో రెండు జిల్లాల్లో సర్వే పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. రెండు జిల్లాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసి, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ఇందుకోసం ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసిందని చెప్పారు. హెల్త్ ప్రొఫైల్ తో అనేక లాభాలు ఉన్నాయని, ఎక్కడకు వైద్యం కోసం వెళ్లినా రిపోర్టులు, డాక్యుమెంట్లు పట్టుకెళ్లాల్సిన అవసరం లేదని, అక్కడ ఈ హెల్త్ ప్రొఫైల్ ను చూస్తే చాలు, ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారం మొత్తం డాక్టర్ కు తెలిసిపోతుందని అన్నారు. తెలంగాణలోని రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ఎలాగైతే దేశానికి ఆదర్శం అయ్యాయో, హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కూడా ఆదర్శం కానుందని చెప్పారు. మరోవైపు ఈ కార్యక్రమం కంటే ముందుగా జిల్లా ఆసుపత్రిలో భవనానికి, పీడియాట్రిక్స్ యూనిట్ కు, రేడియాలజీ ల్యాబ్ కు మంత్రులు శంకుస్థాపన చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ