మూడు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు.. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తమ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలు దక్కించుకోవడమే టార్గెట్గా పావులు కదపడం ప్రారంభించింది. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులలో.. ఒకరిద్దరికి మాత్రమే లోక్ సభ ఎన్నికల కోసం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని, మిగిలిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీల ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించి మరీ బరిలోకి దింపే ప్రయత్నాలను కూడా వేగం చేసినట్లు తెలుస్తోంది.
10 నుంచి 12 స్థానాల్లో ఎంపీ సీట్లకు టికెట్లను ఖరారు చేసే వ్యవహారంలో సులభమేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ తెలంగాణలోకి వచ్చే మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్లగొండ, భువనగిరి, చేవెళ్ల, మల్కాజ్గిరిలతో సహా పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, మెదక్, జహీరాబాద్ స్థానాలలోని అభ్యర్థుల ఎంపిక పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ స్థానాల నుంచి ఇప్పటికే ఇద్దరేసి అభ్యర్దుల చొప్పున పేర్లను పరిశీలిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడానికి కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఎందుకంటే ఆ స్థానాల్లో బీఆర్ఎస్తో పాటు బీజేపీ నుంచి కూడా పోటీ ఎదురవుతుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. దీంతోనే త్రిముఖ పోటీలో గట్టిగా పోటీ ఇచ్చే అభ్యర్థుల కోసం వెతుకుతుందని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ పార్లమెంటు నుంచి అజారుద్దీన్ లేదా ఫిరోజ్ఖాన్, సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి అనిల్కుమార్ యాదవ్ లేదా నవీన్ యాదవ్, నిజామాబాద్ పార్లమెంటునుంచి ధర్మపురి సంజయ్ లేదా టి.జీవన్రెడ్డి, కరీంనగర్ పార్లమెంటునుంచి అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనుమడు రోహిత్రావు, పాడి ఉదయానందరెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి నరేశ్ జాదవ్ లేదా మరో ఆదివాసీ నాయకుడి పేర్లు పరిశీలిస్తున్నారు.
నల్లగొండ నుంచి జానారెడ్డి, పటేల్ రమేశ్రెడ్డిలలో ఒకరు, భువనగిరి పార్లమెంటు నుంచి కోమటిరెడ్డి లక్ష్మి, చామల కిరణ్కుమార్రెడ్డిలలో ఒకరు, మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి వంశీచందర్రెడ్డి, సీతా దయాకర్రెడ్డిలలో ఒకరు, నాగర్కర్నూల్ పార్లమెంటు నుంచి మల్లు రవి లేదా పి.రాములు (కాంగ్రెస్లోకి వస్తే), చేవెళ్ల పార్లమెంటు నుంచి కేఎల్ఆర్ లేదంటే బీఆర్ఎస్ నుంచి వస్తారని అంతా అనుకుంటున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత, ఆయన రాకపోతే బీజేపీ నుంచి మరో కీలక నేత, మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మైనంపల్లి హనుమంతరావును బరిలోకి దింపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇక పెద్దపల్లి పార్లమెంటు నుంచి చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్ కుమారుడు వంశీ లేదా పెరిక శ్యాం, ఖమ్మం పార్లమెంటు నుంచి వి.హనుమంతరావు లేదంటే రేణుకా చౌదరి, పోట్ల నాగేశ్వరరావుల్లో ఒకరు, మహబూబాబాద్ పార్లమెంటు నుంచి బలరాం నాయక్, విజయాబాయి (వైరా)లలో ఒకరికి టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. వరంగల్ పార్లమెంటు నుంచి సిరిసిల్ల రాజయ్య, దొమ్మాట సాంబయ్య, అద్దంకిదయాకర్ పేర్లను, మెదక్ పార్లమెంటు నుంచి జగ్గారెడ్డి లేదా విజయశాంతి, జహీరాబాద్ పార్లమెంటు నుంచి సురేశ్ షెట్కార్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇలా అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే..అప్పుడే పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలోగానే ముందుగానే తన వ్యూహానికి మెరుగుపెడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ