తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల చేపట్టిన పీసీసీ పదవుల నియామకం కల్లోలం రేపుతోంది. ఆయా పదవుల్లో సీనియర్లకు తగిన న్యాయం జరుగ లేదని భావిస్తున్న పార్టీ లోని పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే దీనిపై బాహాటంగా రాష్ట్ర నాయకత్వంపై ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో వారు మంగళవారం మరోసారి సమావేశమవనున్నారు. దీనికి ముందు గత శనివారం నాడు సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క ఇంటిలో ఈ అసంతృప్త నేతలందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహా, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఇతర సీనియర్ నేతలు కోదండ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవల చేపట్టిన పీసీసీ కమిటీల కూర్పు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి పదవులు లభిస్తున్నాయని విమర్శించారు. అయితే వీరి ఆరోపణలపై రేవంత్ రెడ్డి అనుకూల వర్గం స్పందించింది. ఎమ్మెల్యే సీతక్క సహా 12మంది నేతలు తమ పీసీసీ పదవులకు రాజీనామా చేయడం మరోసారి టీ-కాంగ్రెస్లో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్ నేతలు నేడు మరోసారి భేటీ కానుండటం గమనార్హం. ఈ భేటీలో వారు ఏం నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే రేపు వారందరూ ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలవనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలోని అంతర్గత సమస్యలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE