రాష్ట్రంలో జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్డౌన్ ను నేటి నుంచి (జూన్ 20) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తిస్థాయి సన్నద్ధతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది.
ముందుగా దేశవ్యాప్తంగానే కాకుండా, పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని అధికారులందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్ధారించింది. దీంతో లాక్డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు కేబినెట్ ప్రకటించింది.
ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం, తదితర కరోనా స్వీయ నియంత్రణ నియమావళిని విధిగా పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు, ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ